LPG Shortage India: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. దేశంలో ఎల్పీజీ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. యుద్ధం కారణంగా సరఫరా నిలిచిపోతుందనే భయంతో ప్రజలు పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో రోజుకు సగటున 55.7 లక్షల సిలిండర్ల బుకింగ్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఏకంగా 75.7 లక్షలకు పెరగడం ప్రజల్లో ఉన్న భయాందోళనలకు నిదర్శనమని ఆమె వివరించారు.
యుద్ధం కారణంగా విదేశీ దిగుమతులకు ఆటంకం కలిగిన మాట వాస్తవమేనని ప్రభుత్వం అంగీకరించింది. దేశ అవసరాలకు సంబంధించి 60 శాతం గ్యాస్ను భారత్ విదేశాల నుండే దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 90 శాతం దిగుమతులు ఇరాన్ ఆధీనంలో ఉండే హార్ముజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ప్రస్తుతం ఈ మార్గాన్ని ఇరాన్ మూసివేయడంతో పాటు సరుకు రవాణా చేసే ట్యాంకర్లపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దిగుమతులు నిలిచిపోయాయి. ఇప్పటికే సుమారు 10 ట్యాంకర్లు ఈ దాడుల్లో ధ్వంసమవడంతో అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నది. ప్రపంచ చమురు మరియు ఎల్పీజీ రవాణాలో ఐదో వంతు వాటా కలిగిన ఈ మార్గం మూతపడటం చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇప్పటికే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 30 శాతం పెంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న గ్యాస్ మొత్తాన్ని కేవలం గృహ అవసరాలకే మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కొరత ఏర్పడకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ గ్యాస్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు అవసరమైతే ఇతర మార్గాల ద్వారా దిగుమతులు చేసుకునేలా డైవర్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తోంది.
ప్రజలు పుకార్లను నమ్మవద్దని పెట్రోలియం శాఖ విజ్ఞప్తి చేసింది. సిలిండర్ల నిల్వలు సరిపడా ఉన్నందున అత్యవసరమైతే తప్ప పానిక్ బుకింగ్స్ చేయవద్దని కోరింది. ఇలాంటి సమయంలో అనవసరంగా స్టాక్ పేరుతో సిలిండర్లను బుక్ చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దేశీయ ఉత్పత్తి పెరిగిందని సరఫరా వ్యవస్థ సజావుగా సాగుతుందని అధికారులు భరోసా ఇచ్చారు. యుద్ధ పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటామని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
Read Also: ఎల్పీజీ గ్యాస్ ఎలా తయారు చేస్తారు? ఏ ముడి పదార్థాలు అవసరం? ఒక్క క్లిక్తో తెలుసుకోండి!