రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న వేళ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అనూహ్య రీతిలో చేదు అనుభవం ఎదురైంది. తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో స్థానిక ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవ్వడం రాజకీయ వర్గాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది.
వార్డు 9లో నిరసన సెగ..
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు బాబాజీ కాలనీ (9వ వార్డు)లో పర్యటించారు. అయితే ఆయన కాలనీలోకి రాగానే స్థానికులు పెద్ద ఎత్తున అడ్డుకుని తమ గోడును వెళ్లగక్కారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ, తమ కాలనీకి సంబంధించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో స్థానిక కౌన్సిలర్, ప్రభుత్వం విఫలమయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
భూముల సమస్యపై నిలదీత..
ముఖ్యంగా మెడికల్ కాలేజీ నిర్మాణ సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రజలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. ‘గత పదేళ్లలో మెడికల్ కాలేజీ కోసం మా భూములను లాక్కున్నారు. అభివృద్ధి జరుగుతుందని ఆశపడితే, మాకు ప్రత్యామ్నాయంగా ఇవ్వాల్సిన నివాస స్థలాల విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. మా భూములు పోయి, ఇళ్లు లేక వీధిన పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు’ అని బాబాజీ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక కౌన్సిలర్ పనితీరుపై అసహనం..
గత పాలనలో బీఆర్ఎస్ కౌన్సిలర్ కనీసం వార్డు వైపు చూడలేదని, సమస్యలను విన్నవించుకుందామన్నా అందుబాటులో లేరని మహిళలు నిలదీశారు. ఓట్ల కోసం ఇప్పుడు మళ్లీ వస్తున్నారని, గతంలో చేసిన పనులేవో చూపించాలని డిమాండ్ చేయడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, నిర్వాసితుల ఆందోళన మాత్రం తగ్గలేదు. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిరసనలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.