Ponguleti Srinivasa Reddy: ఇల్లందు స్వేచ్ఛ : గత ప్రభుత్వంలో డబల్ బెడ్ రూములు పూర్తికాని వాటన్నింటిని రాజీవ్ గృహకల్ప లో పునర్నిర్మాణం చేపట్టి నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) పేర్కొన్నారు. ఇల్లందు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత మీది. ఇల్లెందు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే బాధ్యత నాదని వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన రోడ్ షో లో శాసనసభ్యులు కోరం కనకయ్య, డిసిసి అధ్యక్షురాలు దేవి ప్రసన్న, స్థానిక నాయకులు వార్డుల అభ్యర్ధులతో కలిసి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగిలేటి పాల్గొన్నారు.
ఇల్లెందు పట్టణంలో నిర్వహించిన ప్రచారంలో అత్యధిక సంఖ్యలో పాల్గొన్న జన సంద్రాన్ని చూస్తుంటే ప్రతిపక్షానికి డిపాజిట్లు దక్కుతాయా అనే అనుమానం కలిగిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవిన్యూ శాఖ మంత్రిగా ప్రభుత్వ భూములు ఎక్కడైతే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉన్నాయో తప్పకుండా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత నాదేనని, ప్రధాన సమస్య సింగరేణి ప్రాంతంలో ఇల్లు కట్టుకున్న వాటిని చాలా వరకు రెగ్యులరైజ్ చేశామన్నారు. ఇంకా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. త్వరలో 76 జీవో ప్రకారం సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు.
పట్టణంలో అక్రమానికి గురై కబ్జా చేసిన ప్రభుత్వ 20 ఎకరాల భూమిని తిరిగి దాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామని, గోవింద సెంటర్ ప్రభుత్వ పాఠశాల దగ్గర ముస్లిం మైనార్టీలకు షాదీఖాన భవనం కోసం ఇప్పటికే నిధులు మంజూరు చేశామని వివరించారు. కూసుపల్లి ఓపెన్ కాస్ట్ ని సింగరేణి ద్వారా దాన్ని కూడా ప్రారంభించే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 24 వార్డుల అభ్యర్ధులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధికి కోసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ఇల్లెందు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.