తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 7 ద్వారా నిరుపేద విద్యార్థుల చదువులకు గండం పొంచి ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని 14 లక్షల మంది బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనారిటీ విద్యార్థులకు ఆసరాగా నిలిచే ఈ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రభుత్వం భయంకరమైన కుట్రకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి తన వద్దే ఉంచుకున్న విద్యాశాఖను కేవలం అస్తవ్యస్తం చేసేందుకే వాడుకుంటున్నారా అని ప్రశ్నించారు.
గత రెండున్నరేళ్ల పాలనలో విద్యావ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా కుప్పకూల్చిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ తీసుకువచ్చిన కొత్త జీవో ముమ్మాటికీ ఫీజుల పథకానికి పాతరేసే ప్రయత్నమని తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు. ఈ జీవో వెలువడిన క్షణం నుంచి అటు విద్యార్థులు.. ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనే భయం నిరుపేద కుటుంబాల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దిక్కుమాలిన చర్యల వల్ల లక్షలాది మంది కలలు కల్లలవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని గురుకులాల్లో ఇప్పటికే 142 మంది విద్యార్థులు మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. వందలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నా పాలకుల్లో చలనం లేదని దుయ్యబట్టారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా కొనసాగించిందని కేటీఆర్ గుర్తు చేశారు. నిరుపేదలకు ఉన్నత విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో పదేళ్లపాటు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేశామన్నారు. మీ సొంత పార్టీ గతంలో తెచ్చిన పథకానికే తూట్లు పొడవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనతో విద్యాశాఖను భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే సహించేది లేదని హెచ్చరించారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి దుర్మార్గమైన జీవో 7ను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థి లోకానికి ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయిన ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విద్యార్థి లోకం గర్జిస్తే పాలకులు రోడ్లపై తిరగలేని పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెట్టి తెచ్చిన ఈ చీకటి జీవోను రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విశ్రమించదని.. ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
ALSO READ: మోడి పర్యటన వేళ బీజేపీ కీలక నిర్ణయం.. సోషల్ మీడియాలో విపక్షాలపై డిజిటల్ దండయాత్ర!