BJP Campaign: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ బీజేపీ కేడర్కు అధిష్టానం దిశా నిర్దేశం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనను పురస్కరించుకుని, విపక్షాలే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడాలని టీబీజేపీ నిర్ణయించింది. తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికగా సరికొత్త యుద్ధానికి భారతీయ జనతా పార్టీ తెరలేపింది. విమర్శల పదును పెంచాలని, కాంగ్రెస్, బీఆర్ఎస్లపై సోషల్ మీడియా వార్ షురూ చేయాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ను ఇరుకున పెట్టేలా విమర్శల దాడిని ముమ్మరం చేయాలని టీబీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో, ఈ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని భావిస్తోంది.
ఈనెల 10వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణ టూర్ సందర్భంగా టీబీజేపీ స్పెషల్ సోషల్ మీడియా క్యాంపెయిన్ ను చేపట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను, గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే బీఆర్ఎస్ పైనా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాలని దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ఎక్స్ వేదికగా క్యాంపెయిన్ నిర్వహించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఆదివారం నుంచే సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపించాలని నిర్ణయించారు. ప్రతి కార్యకర్త విమర్శల్లో పదును పెంచి, ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళ్లాలని పార్టీ పిలుపునిచ్చింది.
Also read: నీళ్లు తేవలేదని 9 ఏళ్ల బాలుడిని కాల్చి చంపిన బంధువు.. కాస్గంజ్లో విషాదం
మే 4న ప్రధాని మోడీ సభకు తరలిరావాలని ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టాలని రాష్ట్ర నాయకత్వం నాయకులు, కార్యకర్తలకు ఆదేశించినట్లు సమాచారం. మే 6న తేదీన కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇద్దరు దొంగలే.., మహిళా ద్రోహులు అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టులు చేయాలని సూచించినట్లు సమాచారం. 8న కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ హిందూ ద్రోహులు అని ఎక్స్ వేదికగా పోస్టులు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఈనెల 9న రండి తరలి రండి మోడీ బహిరంగ సభకు అంటూ పోస్టులు పెట్టాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. అలాగే 10వ తేదీన ‘మోడీ సభకు నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా?’ అంటూ అన్ని సోషల్ మీడియా వేదికల్లో పోస్టులు చేయాలని సూచించినట్లు సమాచారం.
మోడీ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన సాయాన్ని వివరిస్తూనే, స్థానిక పార్టీల వైఖరిని తూర్పారబట్టేలా ప్రత్యేక హ్యాష్ట్యాగ్లతో క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటనకు భారీగా జనసమీకరణ చేయడంతో పాటు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మోడీ సందేశాన్ని ప్రతి ఇంటికీ చేరవేయడమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ సోషల్ మీడియా వార్ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో పైచేయి సాధించాలని, మోడీ పర్యటనకు ముందే అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని టీబీజేపీ గట్టి పట్టుదలతో ఉంది.
Also Read: తెలంగాణ కాంగ్రెస్లో బిగ్ టర్నింగ్ పాయింట్.. ఏఐసీసీ వ్యూహత్మక అడుగు..!