KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో రెండు విడతల్లో కలిపి పార్టీ మద్దతుదారులు 83 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అధికార పార్టీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి ప్రచారం చేయడం చరిత్రలో ఇప్పటివరకు చూడలేదని ఎద్దేవా చేశారు. రెండేళ్ల విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం పరోక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోందని విమర్శించారు. అసలు ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయో కాంగ్రెస్ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని, ప్రజల్లో ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో కొత్త సర్పంచ్లు పనిచేసేది కేవలం రెండున్నర సంవత్సరాలేనని వ్యాఖ్యానించారు.
రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడే అవకాశం ఉందని, కుట్రలు పన్ని సర్పంచ్లను సస్పెండ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే, తమ సర్పంచ్ల హక్కుల రక్షణ కోసం, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రతి జిల్లాలోనూ ఒక ‘లీగల్ సెల్’ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎమ్మెల్యేలు గ్రామంలో ఏ పనీ చేయలేరని, సర్పంచ్లకు ఆ స్థాయి అధికారం ఉంటుందని గుర్తుచేశారు. ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధుల్లో 70 శాతం నేరుగా సర్పంచ్ల ఖాతాల్లోకే వస్తాయని తెలిపారు. గతంలో కేవలం మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణకు దేశవ్యాప్తంగా 30 శాతం అవార్డులు వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.