Krishna River Pollution: జిల్లాలోని మఠంపల్లి మండలంలో పవిత్ర కృష్ణానది కలుషితమైన ఘటనపై రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నదీ జలాలు రసాయనాలతో నిండిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్న తీరుపై ‘బిగ్ టీవీ’ ప్రసారం చేసిన కథనానికి మంత్రి తక్షణమే స్పందించారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు రసాయన వ్యర్థాలను నదిలో డంప్ చేయడంతో నీరంతా రంగు మారి, తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో మట్టపల్లి నుంచి చింత్రియాల వరకు మిషన్ భగీరథ నీటి సరఫరాను అధికారులు ముందుజాగ్రత్తగా నిలిపివేశారు. తాగునీటి వనరులు కలుషితం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత నీటి కారణంగా భక్తులు, గ్రామస్తులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, చేపల వేటకు కూడా ఆటంకం కలుగుతోందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్తో ఫోన్లో మాట్లాడారు. నదిలో రసాయనాలు ఎలా కలిశాయి? దీని వెనుక స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీల నిర్లక్ష్యం ఉందా? లేక ఇతర వ్యక్తుల పనా? అనే కోణంలో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. పోలీస్ శాఖ కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై క్షేత్రస్థాయి పరిశీలనకు రంగంలోకి దిగింది. పవిత్ర నదిని కలుషితం చేస్తున్న వారిని ఉపేక్షించవద్దని స్థానికులు కోరుతున్నారు.