Assembly Case: అసెంబ్లీ గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సైఫాబాద్ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్లకు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హైకోర్టు మధ్యంతర ఉపశమనం
ఈ నెల 7న అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనల ఆధారంగా నమోదు చేసిన కేసుపై మహేందర్ రెడ్డి, మహేష్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం వారిద్దరికీ మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది. అయితే, కేసు దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించాలని వారిని హైకోర్టు ఆదేశించింది.
పండుగ వేళ నోటీసులు..
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చి దర్యాప్తునకు సహకరించాలని స్పష్టం చేశారు. అయితే సరిగ్గా పండుగ రోజే విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.