Mercedes Car Robbery: స్వేచ్ఛ బ్యూరో : కారు అమ్మకానికి పెట్టాడు.. కొనుగోలు చేస్తామంటూ నమ్మించారు. ఫార్మ్హౌస్కు రప్పించారు. అక్కడికి వెళ్లిన తర్వాత అసలు సినిమా మొదలైంది. పిస్టల్, కత్తి చూపించి బెదిరించి.. దాడి చేసి.. చివరకు కారు, నగదు, ఐఫోన్, ఖరీదైన వాచ్లతో ఉడాయించారు. దోపిడీతో ఆగకుండా వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్మెయిల్ చేసి మరో రూ.1.50 లక్షలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఆదివారం కీసర పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఆంజనేయులు వెల్లడించారు. చెప్యాల విద్యాప్రకాష్రెడ్డి అలియాస్ విద్య, అబ్రబోయిన దీక్షిత్, ధరావత్ రాహుల్, అన్నభీమోజు సాయి వినీత్, కొమ్మెరి రాకేష్ కలిసి పక్కా పథకం వేశారు. మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేస్తామని యజమాని మొహమ్మద్ ఇబ్రహీం అలీని నమ్మించారు. ఆగస్టు 30న అతడిని అతని స్నేహితుడు మొహమ్మద్ రఫే హష్మీతో కలిసి కీసరలోని హోలీ మేరీ కళాశాల సమీపంలోని ఫార్మ్హౌస్కు రప్పించారు.
ఫార్మ్హౌస్లో అసలు కథ!
బాధితులు ఫార్మ్హౌస్కు చేరుకోగానే పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. నిందితులు పిస్టల్, కత్తి చూపించి బెదిరించడంతో పాటు ఇనుప రాడ్, ట్యూబ్లైట్, కర్రలతో దాడి చేశారు. అనంతరం బాధితుల వద్ద ఉన్న నగదు, ఐఫోన్, బంగారు గొలుసు, టిస్సాట్, క్యాసియో వాచ్లతో పాటు మెర్సిడెస్ బెంజ్ కారును బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం బాధితులను తమ వాహనంలో ఎక్కించుకుని నాగారం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వదిలేసి పరారైనట్లు సీఐ తెలిపారు.
దోపిడీ చాలదన్నట్లు.. మరోసారి ఫోన్
దోపిడీతో ఆగకుండా నిందితులు మరోసారి బాధితుడిని టార్గెట్ చేశారు. సెప్టెంబర్ 11న విద్యాప్రకాష్రెడ్డి అలియాస్ విద్య, బాధితుడికి ఫోన్ చేసి.. అతని మొబైల్లోని వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఇందుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీఐ ఆంజనేయులు తెలిపారు.
బోగారం వద్ద పోలీసుల వల
కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం బోగారం క్రాస్రోడ్స్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఎయిర్ పిస్టల్, కత్తి, ఐఫోన్, టిస్సాట్, క్యాసియో వాచ్లు, వాహనాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
పోలీసుల సూచనలు
వాహనాల కొనుగోలు, విక్రయాల పేరుతో అపరిచితులను నమ్మి నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లవద్దని సీఐ ఆంజనేయులు సూచించారు. ఆయుధాలతో బెదిరింపులు, వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్మెయిల్ లేదా డబ్బుల డిమాండ్ ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Also Read: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!