KTR: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వేళ, తన బినామీ బాగోతాలు బయటపడకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విచారణల పేరుతో ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తున్నారని రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. KLSR ఇన్ఫ్రా అనే సంస్థ రేవంత్ రెడ్డికి చెందిన బినామీ కంపెనీ అని, దివాలా తీసిన ఆ కంపెనీకి అడ్డగోలుగా రూ. 6,000 కోట్ల విలువైన టెండర్లను ప్రభుత్వం కట్టబెట్టిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్న కంపెనీకి ఇన్ని వేల కోట్ల పనులు ఎలా దక్కాయని, ఇది ముమ్మాటికీ క్విడ్ ప్రోకో అని ఆయన విమర్శించారు.
కేటీఆర్ తన ఆరోపణలకు మద్దతుగా పలు ఆధారాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు KLSR కంపెనీకి చెందిన ల్యాండ్ క్రూజర్ కారులోనే తిరిగేవారని, ఆయన సీఎం అయిన వెంటనే ఆ కంపెనీకి రెక్కలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్పందించిందని, దివాలా తీసిన కంపెనీకి భారీ టెండర్లు ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణంపై సీబీఐ (CBI), ఈడీ (ED), మరియు ఎస్ఎఫ్ఐఓ (SFIO) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం ముఖ్యమంత్రికి పెద్ద ఎదురుదెబ్బ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ అసలు విషయం ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికే తమ పార్టీ నేతలపై వరుస విచారణల డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన భూపాల్ ఇన్ఫ్రా, సాయి మౌర్య వంటి సంస్థలకు KLSR నుండి నిధులు మళ్లాయని కేటీఆర్ వివరించారు. 2018లో రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు జరిగినప్పుడే ఈ బినామీ సంస్థల ప్రస్తావన వచ్చిందని, దావోస్ పర్యటనలో సీఎం మూడు రోజులు మాయం కావడం వెనుక కూడా బినామీ ఆస్తుల సెటిల్మెంట్లే ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ బినామీ బాగోతంపై సమాధానం చెప్పాలని సవాలు విసిరారు.
చివరగా, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కేటీఆర్ విస్మయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ తీరును విమర్శిస్తూ పార్టీ ఫిరాయింపుల అంశం ఒక కామెడీ సీరియల్లా మారిందని దుయ్యబట్టారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రే స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచుతుందని ఆయన స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట లక్షన్నర కోట్ల దోపిడీని అడ్డుకున్నది తమ పార్టీయేనని, భవిష్యత్తులో కూడా ఇలాంటి అవినీతి కార్యక్రమాలను సహించబోమని కేటీఆర్ హెచ్చరించారు.