KTR: కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. పార్టీలో చేర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయం తీసుకున్నాక ఇక మాట్లాడేది ఏముండదని అన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చలు జరిగిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బీఆర్ఎస్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం: కేటీఆర్
కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ తప్పు పట్టే సీబీఐకి రేవంత్ కాళేశ్వరం కేసు అప్పగించారని అన్నారు. ‘కాళేశ్వరంలోని మల్లన్న సాగర్ నీటినే మూసీ పునరుజ్జీవం కోసం వాడుతున్నారు. పత్రికలలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ ప్రకటన ఇచ్చారు. మల్లన్న సాగర్ దగ్గర ప్రారంభోత్సవం చేయకుండా.. గండిపేట దగ్గర మూసీ పునరుజ్జీవం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లా కాదా..? సీఎం సమాధానం చెప్పాలి.. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ సీఎం క్షమాపణ చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.
ప్రజల సొమ్ము ఎక్కడ వృథా అయ్యింది..?
‘కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ప్రచారం చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు ఎందుకు చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు..? 94 వేల కోట్లు ఖర్చయిన ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కామ్ అని ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్ము ఎక్కడా వృథా అయిందని ముఖ్యమంత్రిని అడుగుతున్నా’ అని కేటీఆర్ ప్రశ్నించారు.