KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే.. రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నిన్న రాత్రి రహమత్నగర్ డివిజన్లో చోటుచేసుకున్న కాంగ్రెస్ గూండాల దాడిలో.. గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ను పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటలు కూడా పూర్తికాకముందే.. కాంగ్రెస్ నేతలు అధికార అహంకారాన్ని ప్రదర్శించడం ప్రారంభించారని ఘాటుగా విమర్శించారు. ప్రజలు ఇచ్చిన మద్దతును సేవకు వినియోగించకుండా ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.
మా పదేళ్ల పాలనలో ఎన్నో ఉపఎన్నికల్లో గెలిచాం. అయినా ఏ ఒక్క సందర్భంలోనైనా ప్రత్యర్థులపై దాడులు చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని మేమెప్పటికీ మోసగించలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకు ఏం జరిగినా.. కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది. అర్ధగంటలో వస్తా అని చెప్పినా ఇవ్వాళ వచ్చినం.. ఇకముందు కూడా ఇట్లనే వస్తాం! మా కార్యకర్తపై జరిగిన దాడికి కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి.. ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లనే విర్రవీగితే ప్రజలే బుద్ది చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా వ్యవహరించలేదు. కాంగ్రెస్ ప్రభావితంగా పనిచేసిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ప్రజా వేదికపై చర్చకు రావాలి అని ఆయన అన్నారు.
ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచార విధానాన్ని గురించి మాట్లాడుతూ కేటీఆర్, తమ పార్టీ ఎప్పుడూ పాజిటివ్ క్యాంపెయిన్కి కట్టుబడి ఉందని చెప్పారు. మేము కులం, మతం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయలేదు. ప్రభుత్వ వైఫల్యాలు, ఆరు గ్యారంటీల అమలు లేకపోవడం, ప్రజా సమస్యలు వంటి అసలు అంశాలను ప్రచారంలో ప్రశ్నించాం. అధికారంలో ఉన్న వారు చేసిన దూషణలకు, అసభ్య భాషకు కూడా స్పందించకుండా మేం హూందాగా వ్యవహరించాం అని తెలిపారు.
గత రెండేళ్లుగా బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ.. ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో వెనుకడుగు వేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో దాదాపు అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని.. అంచనా వేసిన విషయాన్ని గుర్తుచేసి, ఇది పార్టీ పట్ల ప్రజల విశ్వాసానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
Also Read: ట్విట్టర్ వదిలి ప్రజల్లోకి రా.. కేటీఆర్ పై కవిత పంచులు
ఉపఎన్నికలో బీఆర్ఎస్కు మద్దతు తెలిపిన ప్రతి ఓటరికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మా పార్టీపై నమ్మకం ఉంచిన ప్రతి ఓటరును పేరుపేరునా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు ఉదయం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు, అక్రమాలు చేసినా.. వాటిని ఎదుర్కొని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన సునీత గోపీనాథ్ను, వారి పిల్లలు చూపిన స్ఫూర్తిని, పోరాటాన్ని కేటీఆర్ అభినందించారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కేటీఆర్ ధైర్యం చెప్పారు.