KTR On Govt: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని మండిపడ్డారు. కనీస అవసరమైన నాణ్యమైన భోజనం కోసం పాఠశాల విద్యార్థులు సైతం నిరంతరం పోరాటాలు చేయాల్సి రావడం రాష్ట్ర పాలనలోని వైఫల్యానికి నిదర్శనమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్.. ఎక్స్ వేదికగా మరోమారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సోమవారం జనగామ జిల్లా గూడూరు గ్రామంలోని గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు తమకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ పాలకుర్తి – స్టేషన్ ఘన్పూర్ ప్రధాన రహదారిపై బైఠాయించిన ఘటన ప్రభుత్వ అసమర్థతను చాటిచెబుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గడిచిన రెండేళ్ల కాలంలో సుమారు 112 ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటి వల్ల 2,422 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 123 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రభుత్వ హత్యలేనని విమర్శించారు. విద్యార్థుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నా ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు.
Also Read: TG BJP Chief: కుమ్మెర ఘటనపై.. రాష్ట్ర బీజేపీ చీఫ్ సీరియస్.. ప్రభుత్వానికి అల్టిమేటం!
ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా నేటికీ తెలంగాణకు పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణమని కేటీఆర్ అన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న రేవంత్ రెడ్డి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం మానేసి కేవలం రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లపైనే దృష్టి సారిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థను గాలికి వదిలేసి, పాలనను విస్మరించిన సీఎం తీరు వల్ల రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం