TG BJP Chief: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర సంఘటనలో ప్రభుత్వం మెజిస్ట్రేట్ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూల్ మండలం కుమ్మిరలో ఓ వర్గం దాడిలో ప్రాణాలు కోల్పోయిన రెండు నెలల చిన్నారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండు నెలల చిన్నారిని పాసవికంగా దాడి చేసి చంపడం దుర్మార్గమన్నారు. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బీసీ కమిషన్ విచారణకు రావడం సరికాదన్నారు.
సొంత జిల్లాలో ఇలాంటి హేయమైన చర్య జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మెర సంఘటనకు నాగర్ కర్నూల్ జిల్లా అధికార యంత్రాగం నిర్లక్ష్యమే కారణమని ధ్వజమెత్తారు. కుమ్మెర సంఘటనలో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేతలను కాపాడేందుకు యత్నిస్తున్నారన్నారు. పోలీసుల నిర్లక్ష్యం చట్టం ఉల్లంఘనేనన్నారు.
Also Read: Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం
హోం శాఖ మంత్రి కూడా తానే అయిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకూ ఈ ఘటనపై స్పందించలేదని రామచంద్రరావు విమర్శించారు. పార్టీ పెద్దలు కూడా మాట్లాడలేదని ధ్వజమెత్తారు. జిల్లాలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోందని.. పాలనపై సీఎం రేవంత్ రెడ్డి పట్టుకోల్పోయారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల్లోనే పోలీసులు పని చేస్తున్నారన్నారు. సంఘటనపై మెజిస్టీరియల్ ఎంక్వయిరీ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై, తప్పు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.