Indigo Flight Fire: హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానం 6E108లో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక ప్రయాణీకుడి పవర్ బ్యాంక్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటన 2026 మే 05వ తేదీన చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో విమానంలోని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. క్యాబిన్ అంతా దట్టమైన పొగతో కమ్ముకుపోవడంతో ఊపిరి ఆడక ప్యాసెంజర్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
మంటలను గమనించిన ఇండిగో క్యాబిన్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా పైలట్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఖాళీ చేయించారు. చండీగఢ్ విమానాశ్రయ అధికారులు ప్యాసెంజర్లను క్యాబిన్ నుండి టెర్మినల్ కు సురక్షితంగా తరలించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణీకులకు స్వల్ప గాయాలవ్వగా వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి పంపారు.
విమానాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించిన తర్వాతే తదుపరి సర్వీసులకు అనుమతిస్తామని ఎయిర్ పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు. కస్టమర్ల భద్రత కోసం అన్ని రకాల సేఫ్టీ మెజర్స్ పాటించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై విమానయాన శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సాంకేతిక లోపమా లేక నిబంధనల అతిక్రమణ జరిగిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
పవర్ బ్యాంక్ పేలుడు నేపథ్యంలో డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పవర్ బ్యాంక్ లను కేవలం క్యారీ–ఆన్ లగేజ్ (హ్యాండ్ బ్యాగ్) లో మాత్రమే అనుమతించనున్నారు. విమాన ప్రయాణ సమయంలో పవర్ బ్యాంక్ వినియోగించడాన్ని 2026 కొత్త నిబంధనల ప్రకారం పూర్తిగా నిషేధించారు. విమాన ప్రయాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో ప్యాసెంజర్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు
Read Also: దళపతి ‘విశ్వరూపం’.. 108 సీట్లతో విజయ్ ప్రభంజనం.. సత్యరాజ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!