Hyderabad Police: తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ సంచలనం సృష్టించిన కోఠి బ్యాంక్ స్ట్రీట్ కాల్పుల కేసులో ఇద్దరు అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగలను టాస్క్ ఫోర్స్ అధికారులు సుల్తాన్ బజార్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. వారి నుంచి నాటుతుపాకీ, 35 బుల్లెట్లు, 2.38లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దోపిడీలో నిందితులుగా ఉన్న మరో అయిదుగురు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు వేటను ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి, సుల్తాన్ బజార్ ఏసీపీ మత్తయ్యతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రంలోని ఓ వస్త్ర వ్యాపారి వద్ద పని చేస్తున్న రిన్షద్ అనే వ్యక్తి గతనెల 31న బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్న ఏటీఎం సెంటర్ లో ఆరు లక్షల రూపాయలను డిపాజిట్ చేయటానికి హోండా యాక్టీవాపై వచ్చాడు.
Also Read: Pradeep Ranganathan: రూ. 50 లక్షల నుంచి రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ వరకు.. ప్రదీప్ క్రేజ్ ఇది!
ఏటీఎం లోపలికి వెళుతుండగానే ఇద్దరు దుండగులు అతనిపై దాడి చేసి నగదుతో ఉన్న బ్యాగును దోచుకునే ప్రయత్నం చేశారు. రిన్షద్ ప్రతిఘటించటంతో నాటుతుపాకీతో అతని కాలుపై ఓ రౌండ్ కాల్పలు జరిపి బ్యాగును దోచుకుని అతని యాక్టీవా పైనే అక్కడి నుంచి ఉడాయించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న డీ మార్ట్ పక్క సందులో దుస్తులు మార్చుకుని వాహనాన్ని అక్కడే వదిలేసి ఆటోలో పరారయ్యారు. ఈ సంఘటన హైదరాబాద్ లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో నిందితులను పట్టుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ సీఐ చంద్రశేఖర్, ఖైరతాబాద్ జోన్ సీఐ రంజిత్ కుమార్ గౌడ్, ఎస్ఐలు జ్ఞానదీప్, జీ.శ్రీకాంత్, సుల్తాన్ బజార్ సీఐ జీ.నరేశ్ తదితరులతో 6 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీతోపాటు మరికొన్ని కీలక ఆధారాలను సేకరించి దోపిడీకి పాల్పడ్డ వారిలో ఉత్తప్రదేశ్ కు చెందిన ఫుర్కాన్ అహమద్ (36), హైదరాబాద్ కు చెందిన మహ్మద్ తయ్యబ్ త్యాగి (30)లను అరెస్ట్ చేశారు.
మహ్మద్ తయ్యబ్ త్యాగి వృత్తిరీత్యా ఓలా/ఉబేర్ డ్రైవర్. రైడ్ల మీద వెళ్లినపుడు తెల్లవారుఝాము సమయంలో బ్యాంక్ స్ట్రీట్ లోని ఎస్బీఐ ఏటిఎం సెంటర్ లో నగదును డిపాజిట్ చేయటానికి వచ్చే వారిని గమనించి దోపిడీకి పథకం వేశాడు. దాని ప్రకారం ఉత్తరప్రదేశ్ లో ఉంటున్న బంధువులు ఫుర్కాన్ అహమద్, ఫహీమ్ అహమద్, నౌసాద్, ఆబిద్, డానిష్ త్యాగి, మహ్మద్ మత్లూబ్ లను హైదరాబాద్ పిలిపించాడు. నాటుతుపాకీ, బుల్లెట్లను సమకూర్చుకున్నాడు. అనంతరం సహచరులతో కలిసి రెక్కీ కూడా చేశాడు. గతనెల 3న రిన్షద్ డబ్బు డిపాజిట్ చేయటానికి వచ్చినపుడు ఫుర్కాన్ అహమద్ తో కలిసి కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడ్డాడు. కేసులో నిందితులుగా ఉన్న ఫహీమ్ అహ్మద్, నౌషాద్, ఆబిద్, డానిష్ త్యాగి, మహమ్మద్ మత్లూబ్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ చెప్పారు. చాకచక్యంగా దర్యాప్తు నిందితులను అరెస్ట్ చేసిన సిబ్బందిని అభినందించారు.
Also Read: Indian Restaurant Closure: పాక్ వేధింపులు.. లండన్లో మూతపడ్డ భారత రెస్టారెంట్.. యజమాని భావోద్వేగం!