MP Chamala Kiran Kumar Reddy: తెలంగాణలో గత ప్రభుత్వ అవినీతిపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్పై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి పాపులారిటీని చూసి బండి సంజయ్ ఓర్వలేకపోతున్నారని ఆయన మండిపడ్డారు. కేరళలో రేవంత్ రెడ్డి ఏం చేశారో తెలుసుకోకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి గేమ్ ఛేంజరా కాదా అనేది గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే నిరూపించాయని.. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్ను గద్దె దించి రేవంత్ రెడ్డి తన సత్తా చాటారని గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించారని చమత్కరించారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కేంద్రం.. సీబీఐ ఎందుకు మౌనంగా ఉన్నాయని ఎంపీ కిరణ్ రెడ్డి ప్రశ్నించారు. సెప్టెంబర్ 1, 2025న కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని.. అయినా ఇప్పటివరకు విచారణ ఎందుకు ప్రారంభం కాలేదని నిలదీశారు. “సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తాడో పేడో తేలుస్తామని కిషన్ రెడ్డి అన్న మాటలు ఏమయ్యాయి?” అని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం కాళేశ్వరం మాత్రమే కాకుండా.. విద్యుత్ కొనుగోళ్లు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ మదన్ బీ లోకూర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ విచారణకు ఆదేశించినా కేంద్రం ఎందుకు కదలడం లేదని ఆక్షేపించారు. కేంద్రం తీసుకుంటున్న ఈ జాప్యాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.
తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలవడంలో బీఆర్ఎస్ పాత్ర ఉందని కిరణ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ‘అవయవదానం’ చేసిందని ఆయన ఆరోపించారు. దీనికి నిదర్శనంగా సిరిసిల్ల, సిద్దిపేట ఫలితాలను ఉదాహరణగా చూపారు. సిరిసిల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 18 వేల ఓట్లు వస్తే.. లోక్ సభ ఎన్నికల్లో అవి ఏకంగా 70 వేలకు పెరిగాయని పేర్కొన్నారు. అలాగే సిద్దిపేటలో 23 వేల నుంచి 62,800 ఓట్లకు పెరగడం వెనుక ఉన్న మర్మాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ మొదలుపెట్టకపోతే బీఆర్ఎస్.. బీజేపీ ఒకటేనని ప్రజలు నమ్ముతారని స్పష్టం చేశారు.
ఈ నెల 10వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఉన్న నేపథ్యంలో.. అంతకంటే ముందే బీఆర్ఎస్ అవినీతిపై సీబీఐ విచారణ ప్రారంభించి కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపైనర్గా కేరళలో మాత్రమే ప్రచారం చేశారని.. అస్సాం, బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి బాధపడటం మానేసి.. రాష్ట్రానికి రావాల్సిన విచారణలు.. నిధులపై బండి సంజయ్ దృష్టి సారించాలని సూచించారు.
Read Also: బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే.. మోదీ వచ్చేలోపు బండి సంజయ్ ఆన్సర్ చెప్పాలి: మహేష్ కుమార్ గౌడ్