KTR Warangal Rythu Sangrama Sabha: వరంగల్ గడ్డపై నిర్వహించిన రైతు సంగ్రామ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ నయవంచనకు తెరలేపిందని ఆయన విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని.. ఒక చిత్తు కాగితంతో సమానమని ఆయన అభివర్ణించారు. ఓట్ల కోసం బట్టెబాజ్ ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు దోకేబాజ్ పనులు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడిచినా రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. “రాహుల్ గాంధీ.. నువ్వు చేసిన డిక్లరేషన్ ఎక్కడ చచ్చింది?” అని ఆయన సూటిగా ప్రశ్నించారు. రైతులను రాజులను చేస్తామని చెప్పి ఇప్పుడు వారి కంచంలో మన్ను పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అండగా ఉండాల్సింది పోయి.. అవమానకరంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వెళ్లి కప్పం కడుతున్నారని.. అందుకే ఆయనను ‘రెన్యూవల్ సీఎం’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతాంగం సొమ్మును మూటలు కట్టి రాహుల్ గాంధీ ఖాతాలోకి పంపుతున్నారని ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేసిన లక్షల కోట్ల అవినీతి ఆరోపణలన్నీ అబద్ధాలని హైకోర్టు తీర్పుతో తేలిపోయాయని కేటీఆర్ పేర్కొన్నారు. లక్ష కోట్ల అవినీతి అని మాట్లాడే కాంగ్రెస్ నాయకులను ఎడమకాలి చెప్పుతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎండిపోయిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తెచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గతంలో మేడిగడ్డపై బాంబులు పెట్టిన వారే.. ఇప్పుడు హుజూరాబాద్ వంటి చోట్ల రైతులకు నీళ్లిచ్చే చెక్ డ్యాంలను పేలుస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రజా కవి కాలోజీ నారాయణరావు చెప్పినట్లు.. రైతుకు జరిగిన మోసాన్ని మర్చిపోకుండా.. కాలం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాటు వేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రైతన్నకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉంటుందని.. కానీ ఆ ఓపిక నశిస్తే భూకంపం పుట్టించే శక్తి కూడా రైతుకు ఉంటుందని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. నాగళ్లతో పొలాలను దున్నడమే కాదు.. అదే నాగలి తిరగేసి కాంగ్రెస్ వాళ్లను ఊరూర ఉరికించి కొట్టడం కూడా రైతులకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి వచ్చిన దొంగలు.. గల్లీలోని తొట్టి గ్యాంగ్ను వెంటేసుకొని రైతులను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
Read Also: చిన్నదొరకు పట్టం గట్టేందుకు .. సీనియర్లంతా గూడి.. రైతు సంగ్రామ సదస్సు పెట్టి..!