Kukatpally Robbery Case: కూకట్పల్లి జోన్ పరిధిలో సంచలనం సృష్టించిన కోటి రూపాయల దోపిడీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని వారి నుంచి సుమారు 77 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు కూకట్పల్లి జోన్ డీసీపీ రీతీరాజ్ వెల్లడించారు. ఈ కేసులో విస్తుపోయే నిజం ఏమిటంటే బాధితుడిగా నటించిన వ్యక్తి స్వయంగా ఈ కుట్రలో భాగస్వామి కావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ దోపిడీకి సంబంధించి డీసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు ఖుస్రుద్దీన్ హవాలా డబ్బును తరలిస్తున్న సమయంలో ఆ సొమ్ముపై కన్నేశాడు. నగదును కాజేయడానికి తన స్నేహితులతో కలిసి పక్కా పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం ఖుస్రుద్దీన్ క్యాష్ బాక్స్తో వెళ్తున్న సమయంలో మూడు బైక్లపై వచ్చిన గ్యాంగ్ అతడిని వెంబడించింది. కూకట్పల్లి పిల్లర్ నెం. 836 వద్దకు చేరుకోగానే నిందితులు సినిమా ఫక్కీలో కళ్లలో మిరపపొడి చల్లి దాడి చేశారు. ఆ సమయంలో బైక్ అదుపుతప్పి బస్సును ఢీకొట్టడంతో బాధితులు కిందపడిపోయారు. ఇదే అదునుగా భావించిన నిందితులు నగదు ఉన్న కాటన్ బాక్స్తో పరారయ్యారు.
ఘటన జరిగిన సమయంలో అదే మార్గంలో వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వెంటనే ఇన్స్పెక్టర్కు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకోగా నిందితులు తమ హోండా యాక్టివా వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఆ వాహనం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు అది ఒక మహిళ పేరు మీద ఉన్నట్లు.. దానిని బహుదూర్పురాకు చెందిన సోహెల్ వాడుతున్నట్లు తేలింది. సాంకేతిక ఆధారాల సాయంతో సోహెల్ ఫోన్ సిగ్నల్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉన్నట్లు గుర్తించారు.
నిందితులు లక్నోకు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఒమర్ షరీఫ్.. హౌస్ సద్దాం.. హమీద్.. ఖుస్రుద్దీన్లను అరెస్ట్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ మరియు టెక్నికల్ ఎవిడెన్స్తో కూకట్పల్లి పోలీసులు.. బాలానగర్ సీసీఎస్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఇంకా ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీసీపీ తెలిపారు. అతి తక్కువ సమయంలో కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఆమె అభినందించారు.
Read Also: GHMC: దోమలపై దండోరా.. క్లీన్ సిటీగా హైదరాబాద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ దూకుడు!