BigTV English

Telangana: తాజా సర్వే లెక్కలివే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. మరి, బీజేపీ?

Telangana: తాజా సర్వే లెక్కలివే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ.. మరి, బీజేపీ?
kcr revanth bandi sanjay

Telangana Politics(Latest breaking news in telugu): తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే పార్టీలో చేరికలపై పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్ కు ముందు నుంచి బలమున్న జిల్లాలపై దృష్టి సారించారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.


ఆయా జిల్లాల్లోని కీలక నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు హస్తం నేతలు. ఇతర పార్టీల్లోని వారి ఆకర్షించడం ద్వారా మరింత బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. ఎప్పటికప్పుడు సర్వేలు జరిపిస్తూ పార్టీ పరిస్థితిని అంచనా వేస్తోంది. నియోజకవర్గాలు, జిల్లాలు, పోటీ చేసే అభ్యర్థులు, వారి నిబద్ధత, జనంలో వారికున్న పలుకుబడి, పార్టీపై జనాభిప్రాయాన్ని పక్కాగా లెక్కలేస్తోంది.

ఇప్పటి వరకు వచ్చిన సర్వేల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సమానంగా ఉన్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 45 అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్.. మరో 45 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన చెప్పారు. ఇక బీజేపీ, ఎంఐఎం పార్టీలకు చెరో ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందన్నారు. ఇక బీజేపీ ఓటింగ్ శాతం 22 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు.


ఇక 15 స్థానాల్లో బిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ వుంటుందని సర్వేలో తేలిందని రేవంత్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ పార్టీకి 37 శాతం ఓటింగ్ శాతం ఉండగా.. కాంగ్రెస్ పార్టీకి 35 శాతం ఓటింగ్ శాతం ఉందని అంతర్గత సర్వేలో తేలినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కి 46.9 శాతం ఓట్లు రాగా.. కాంగ్రెస్ కి 28.4 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 7.1 శాతం ఓట్లు వచ్చాయి.

రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణలను పరిశీలించిన కాంగ్రెస్ వ్యూహకర్తలు.. తమకు ముందు నుంచి పట్టున్న జిల్లాలలో స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో.. 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాల్లో, సీపీఎం ఒక్క చోట, వైసిపి 3 స్థానాల్లో గెలవగా.. బిఆర్ఎస్ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ ఒక్క స్థానంలో, టీడీపీ 2 చోట్ల విజయం సాధించగా.. ఇండిపెండెట్ అభ్యర్థి ఒక్క స్థానంలో గెలిచారు.

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు గానూ 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 5 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బిఆర్ఎస్ 6 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. సీపీఐ ఒక్క అసెంబ్లీ స్థానంలో గెలిచింది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 03 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. బిఆర్ఎస్ 9 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది.

మరోవైపు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 2014 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 3, టీడీపీ 2, బిఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందాయి. అయితే 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ 13 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయింది.

ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గానూ 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక చోట, బిఆర్ఎస్ 8 స్థానాల్లో, టీడీపీ 2 స్థానంలో, మరో ఇండిపెండెంట్ విజయం సాధించారు. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క చోట గెలుపొందగా.. బిఆర్ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది.

అయితే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. నాలుగు ఉమ్మడి జిల్లాల్లో 48 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈ సారి 35కు పైగా స్థానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ వ్యూహాలు పన్నుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో విజయం కోసం పెద్దఎత్తున చేరికలను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది. ఖమ్మం జిల్లా నుంచి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి స్వంత గూటికి రానున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వున్న కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బిఆర్ఎస్ కీలక నేతలకు ఎన్.ఆర్.ఐ.లతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×