Chamala Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎనిమిది మంది సభ్యులపై ఉన్న సస్పెన్షన్ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సస్పెషన్ ఎత్తివేత నేపథ్యంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు.. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సభలోకి ప్లకార్డులు తేవద్దని, సభాపతి పోడియం వద్దకు రావద్దని స్పీకర్ సూచించినట్లు తెలిపారు. అయితే సభను డిస్ట్రబ్ చేయాలని తాము అనుకోవడం లేదని.. చామల తేల్చి చెప్పారు. ప్రజలు ఎన్నో ఆశలతో తమను పార్లమెంటు వరకూ పంపించారని.. కాబట్టి స్పీకర్ నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కొన్నారు.
ఎల్పీజీ కొరత, అమెరికా టారిఫ్స్ పై సభలో చర్చ పెట్టాలని ఈ సందర్భంగా స్పీకర్ ను చామల డిమాండ్ చేశారు. సభలో ప్రజా సమస్యలపై చర్చకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేటప్పుడు అడ్డు తగలకుండా స్పీకర్ చర్యలు తీసుకోవాలన్నారు. సభ సజావుగా సాగాలని తాము కూడా కోరుకుంటున్నట్లు మరోమారు చామల స్పష్టం చేశారు.
చామల సహా 8 మంది కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేతకు సంబంధించిన సమాచారాన్ని లోక్ సభ విప్ సోమవారం రాత్రే అందించారు. ఈ విషయాన్ని ఎంపీ చామల స్వయంగా తెలియజేస్తూ వీడియో సందేశం విడుదల చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలిపే సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్ కట్ చేయడం పట్ల నిరసన తెలిపినందుకు తమను సస్పెండ్ చేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను నొక్కేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు మీకు ఇంకా పడలేదా.. త్వరగా ఇలా చేయండి..?
లోక్ సభ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారన్న చామల.. 543 మంది ఎంపీలను సమాన దృష్టితో చూడాలని కోరారు. ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాల ఒత్తిళ్లకు తలొగ్గి విపక్ష సభ్యులను ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో తాము రాజీపడబోమని చామల కిరణ్ స్పష్టం చేశారు.
Also Read: Assam Election 2026: అస్సాం పీఠంపై ‘హ్యాట్రిక్’ గురి.. కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ ఇదే!