కరీంనగర్ జిల్లా పర్యాటక రంగంలో మరో కీలక అడుగు పడింది. లోయర్ మానేరు డ్యాం (LMD) జలాల్లో స్టీమర్ (వాటర్ ట్రాన్స్పోర్ట్) సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రోజున కరీంనగర్ నుంచి మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం వరకు స్టీమర్ ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్టీమర్ సేవలు ప్రారంభం కావడం వల్ల మైలారం మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు.. ఖాసీంపేటలోని శ్రీ మానసాదేవి ఆలయం, పారువెల్ల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జల రవాణా అందుబాటులోకి రావడం వల్ల పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టుపై స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పూర్తిస్థాయిలో స్టీమర్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ వరాల పరశురాములు, ప్రధాన అర్చకులు మామిడాల నాగసాయిశర్మ, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ALSO READ: Municipal Elections: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా.. ఓటర్ల జాబితా విడుదల చేసిన ఎస్ఈసీ