Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పీసీసీ చీఫ్గా మహేష్కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన ఇదే తొలి ఎన్నిక కావడంతో.. కాంగ్రెస్ నేతలు విజయాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద జరిగిన సంబరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి.
జూబ్లీహిల్స్ ఫలితాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి.. మంత్రుల వరకు అందరూ కష్టపడ్డారని నేతలు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన పీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ను ప్రభుత్వ పథకాల సలహాదారుడు సుదర్శన్రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీ కార్యకర్తలు నినాదాలతో కార్యాలయాన్ని హోరెత్తించారు. డప్పులు, పటాకులు, భారీ కాన్వాయ్తో పిసిసి చీఫ్ వచ్చింది నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా మహేష్కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే ఎనిమిదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయం. మేము ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నారు అని తెలిపారు.
అలాగే బీసీ వర్గాల కోసం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను గుర్తుచేశారు. 42% బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఇది తెలంగాణ చరిత్రలోనే పెద్ద సామాజిక న్యాయ నిర్ణయం అవుతుంది అని అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలువడం పట్ల సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్ లో కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు అంకితం అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ప్రభుత్వం మీద నమ్మకం ఉంచారని, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల గుండెల్లో నేరుగా పడుతున్నాయని పేర్కొన్నారు.
Also Read: జూబ్లీలో దూసుకెళ్తున్న కాంగ్రెస్.. ‘కారు’లో కలవరం, గాంధీ భవన్లో సంబరాలు
ఈ సందర్భంగా బీహార్ ఎన్నికలపై కూడా మహేష్ గౌడ్ స్పందించారు. బీహార్ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని మా అంచనా. కానీ అక్కడ రాజకీయ సమీకరణాలు క్లిష్టంగా ఉండటం వల్ల ఫలితాలు తేడాగా రావచ్చు. అయినప్పటికీ కాంగ్రెస్ అక్కడ కూడా తిరిగి నిలబడుతుంది అని తెలిపారు.