Hyderabad Mango Prices: పశ్చిమ ఆసియా (West Asia) సంక్షోభం కారణంగా హైదరాబాద్ మార్కెట్లో మామిడి పండ్ల ధరలు తగ్గే అవకాశం ఉందని తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. అదే జరిగితే గతేడాదితో పోలిస్తే మామిడి పండ్లు.. ఈసారి తక్కువకే లభించే అవకాశముంది. సమ్మర్ లో మామిడి పండ్ల కోసం ఎదురుచూసేవారికి ఇది నిజంగా తీపికబురు కానుంది. అయితే పశ్చిమాసియా సంక్షోభానికి, హైదరాబాద్ లో ధరలు తగ్గడానికి మధ్య లింకేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
దేశంలో పండే మామిడి పండ్లకు.. పశ్చిమ ఆసియా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. భారత్ నుంచి ప్రతీ ఏటా సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి విదేశాలకు ఎగుమతి అవుతుంది. అందులో 1/3 వంతు అంటే దాదాపు 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా మామిడి.. ఒక్క యూఏఈ దేశానికి వెళ్తుంది. ఇరాన్ – ఇజ్రాయెల్ – అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం.. గల్ఫ్ దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని నివేదికలు పేర్కొంటున్నాయి.
తెలంగాణ నుండి ప్రతి ఏటా సుమారు 7,000 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లు.. యూఏఈ, అమెరికా, కెనడా వంటి దేశాలకు ఎగుమతి అవుతుందని నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే యుద్ధ వాతావరణం వల్ల విమాన ప్రయాణాలు, రవాణా మార్గాల్లో ఆటంకాలు ఏర్పడి తెలంగాణ నుంచి మామిడి ఎగుమతులు 20% నుండి 30% వరకు తగ్గాయి. దీనికి తోడు యుద్ధం కారణంగా ఎయిర్ ఫ్రైట్ (విమాన రవాణా) ఛార్జీలు కిలోకు రూ.250 నుండి ఏకంగా రూ. 800 – 900 వరకు పెరిగాయి. దీంతో అంత ఖర్చు చేసి మామిడి పండ్లను ఎగుమతి చేయడం ఇక్కడి వ్యాపారులకు భారంగా మారిపోయింది.
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో విదేశాలకు వెళ్లాల్సిన ప్రీమియం క్వాలిటీ మామిడి పండ్లు ముఖ్యంగా బంగినపల్లి.. ఇప్పుడు స్థానిక మార్కెట్కు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్కెట్ లో సరఫరా పెరగడం వల్ల ధరలు దిగివస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పైగా మామిడి పండ్లు నిల్వ ఉండే కాలం కేవలం 19 – 25 రోజులు మాత్రమే కావడంతో ఎగుమతిదారులు తమ స్టాక్ను ఎక్కువ కాలం దాచలేక తక్కువ ధరకైనా విక్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
Also Read: TCS Nashik Case: మహిళా ఉద్యోగులపై వేధింపులు.. మత మార్పిడికై ఒత్తిడి.. వెలుగులోకి నమ్మలేని నిజాలు!
తెలుగు రాష్ట్రాల్లో మామిడి పండ్లకు అతిపెద్ద మార్కెట్ గా హైదరాబాద్ ఉంది. తెలంగాణలోని ఇతర జిల్లాలతో పాటు ఏపీ, కర్ణాటక నుంచి కూడా విభిన్న రకాలకు చెందిన మామిడి పండ్లు నగరానికి వస్తుంటాయి. పశ్చిమ ఆసియా సంక్షోభం ప్రభావంతో హైదరాబాద్ లోనూ మామిడి పండ్ల ధరలు తగ్గొచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్ లో బంగినపల్లి మామిడి కిలో రూ.150-200 పలుకుతోంది. రసాలు కిలో రూ.100-150 మధ్య విక్రయిస్తున్నారు. నివేదికలు చెప్పింది నిజమైతే.. ఈ వేసవిలో హైదరాబాద్ ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మామిడి పండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.
Also Read: Cooking Cost: ఎల్పీజీ vs ఇండక్షన్ vs హైడ్రోజన్.. సామాన్యుల వంటగదికి.. ఏది బెస్ట్ ఛాయిస్?