paddy storage: చౌటుప్పల్ మండల పరిధిలోని అంకిరెడ్డిగూడెంలో రైతుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఒక భారీ ప్రైవేటు గోదామును మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. రైతులు పండించిన వరి ధాన్యం ఎండకు ఎండి, వానకు తడవకుండా సురక్షితంగా నిల్వ చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దాదాపు 12 వేల మెట్రిక్ టన్నుల (3 లక్షల బ్యాగులు) సామర్థ్యం, అంటే దాదాపు లక్షా యాభై వేల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని దాచుకోగలిగేలా ఈ ప్రైవేట్ గోదామును ప్రభుత్వం తరఫున తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అధికారులకు కీలక ఆదేశాలు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి చౌటుప్పల్ మండలంలో రెండు రెట్లు, నారాయణపూర్ మండలంలో ఏకంగా నాలుగు రెట్లు ధాన్యం దిగుబడి పెరిగిందని చెప్పారు. పంట విపరీతంగా రావడం, దానికి తోడు హమాలీల కొరత ఏర్పడటం, కొందరు మిల్లర్ల తీరు వల్ల ధాన్యం సేకరణ ప్రక్రియ కొంత ఆలస్యమైందనే నిజాన్ని ఆయన బహిరంగానే అంగీకరించారు. ఈ ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం తరఫున రైతులకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, రాబోయే పది రోజుల్లోగా ధాన్యం సేకరణ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులను గట్టిగా ఆదేశించామన్నారు.
రైతు ప్రభుత్వంగా అండగా ఉంటాం
ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం ప్రభుత్వ పెద్దలతో, ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాత్రింబవళ్లు కష్టపడి రైతులను ఆదుకోవాలనే పట్టుదలతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. ధాన్యం నిల్వ సామర్థ్యం పెంచేందుకు ఇలాంటి మరిన్ని పెద్ద ప్రైవేటు గోదాములను కూడా మాట్లాడుతున్నామని, రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, రాబోయే పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసి తీరుతామని మాట ఇచ్చారు.
Also Read: ఎవరీ కసిరెడ్డి.. లిక్కర్ స్కామ్తో మాకేం సంబంధం: వైఏస్ జగన్ ఫైర్..!