ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాజకీయ సెగలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక కోసం జరుగుతున్న ఈ పోరులో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్ (BRS) హోరాహోరీగా తలపడుతున్నాయి. జిల్లాలోని మొత్తం 19 మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజారిటీ వచ్చిన చోట గెలుపు ధీమా కనిపిస్తుండగా, హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీల్లో మాత్రం ఉత్కంఠ పరాకాష్టకు చేరింది.
మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు ‘క్యాంపు’ రాజకీయాలకు తెరలేపాయి. కౌన్సిల్ సభ్యులు చేజారిపోకుండా ఉండేందుకు అగ్రనేతలు వారిని రహస్య ప్రాంతాలకు తరలించారు. రేపు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో సభ్యుల సమక్షంలో ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. పార్టీ అధిష్టానం పంపే ‘సీల్డ్ కవర్’లో ఎవరి పేరు ఉంటే వారికే మద్దతు తెలపాలని ఇప్పటికే కౌన్సిలర్లకు పార్టీలు హుకుం జారీ చేశాయి.
మెదక్, నర్సాపూర్, జిన్నారం, ఇస్నాపూర్ మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడటంతో ఇక్కడ కింగ్ మేకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నర్సాపూర్, జిన్నారంలో బీజేపీ కౌన్సిలర్ల మద్దతు ఎటు ఉంటే వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంది. అయితే, వైస్ చైర్మన్ పదవి ఇస్తామన్న ప్రతిపాదనలను తిరస్కరిస్తూ, తమకు చైర్మన్ సీటు కావాలని కమలనాథులు పట్టుబడుతుండటం గమనార్హం. ఇస్నాపూర్లో స్వతంత్ర కౌన్సిలర్లు, ఎక్స్-అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.
ప్రస్తుత లెక్కల ప్రకారం కాంగ్రెస్ 7 చోట్ల, బిఆర్ఎస్ 8 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 4 చోట్ల హంగ్ నెలకొంది. సంగారెడ్డి (చైర్మన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ షేక్ షఫీ), సదాశివపేట (చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరు), నారాయణఖేడ్, రామాయంపేట వంటి చోట్ల కాంగ్రెస్ ఇప్పటికే పట్టు సాధించింది. గజ్వేల్, దుబ్బాక, తూప్రాన్, గడ్డపోతారం, చేర్యాల వంటి చోట్ల గులాబీ జెండా ఎగిరింది.
రేపు జరగబోయే ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల సభ్యులు పెట్టే డిమాండ్లకు తలలు పట్టుకోవడం పార్టీ ప్రముఖుల వంతవుతోంది. గంట గంటకు మారుతున్న సమీకరణాల మధ్య బల్దియా పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.
ALSO READ: Thorrur: తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండానే ఎగురుతుంది.. మాజీ మంత్రి ఎర్రబెల్లి ధీమా