ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు అంకురార్పణ జరిగింది. జాతరలో భాగంగా నిర్వహించే అత్యంత కీలకమైన గుడిమెలుగు పండుగ బుధవారం మేడారంలో అత్యంత భక్తిశ్రద్ధల నడుమ ప్రారంభమైంది. ఈ తంతుతో మహా జాతర ప్రధాన ఘట్టాలకు గిరిజన పూజారులు శ్రీకారం చుట్టారు.
ఆలయాల శుద్ధి – గంగ స్నానాలు
గుడిమెలుగు పండుగను పురస్కరించుకుని మేడారంలోని సమ్మక్క ఆలయం, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల పూజారులు తెల్లవారుజామునే జంపన్న వాగుకు చేరుకున్నారు. అక్కడ పవిత్ర గంగ స్నానాలు ఆచరించిన అనంతరం వాగు నుంచి పుణ్యతీర్థాన్ని తీసుకువచ్చి ఆలయాలను సంప్రదాయబద్ధంగా శుద్ధి చేశారు. దేవతా పీఠాలను ఎర్రమట్టితో అలికి, పసుపు కుంకుమలతో ముగ్గులు వేసి అత్యంత సుందరంగా అలంకరించారు.
ప్రకృతి ఒడిలో పూజా కార్యక్రమాలు
ఈ పండుగలో ప్రధాన ఆకర్షణ ఆలయాల పైకప్పును నూతనంగా అలంకరించడం. ప్రతి ఏటా గుడిమెలుగు సమయంలో పాత గడ్డిని తొలగించి, అడవి నుంచి సేకరించిన నూతన గుట్ట గడ్డితో ఆలయ పైకప్పును వేయడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే పూజారులు ప్రకృతి సిద్ధమైన వనరులతో ఆలయ రూపురేఖలను మార్చారు. అనంతరం దేవతలకు ప్రత్యేక ధూపదీప నైవేద్యాలను సమర్పించి, రాబోయే మహా జాతర ఎటువంటి విఘ్నాలు లేకుండా సాగాలని మొక్కులు చెల్లించుకున్నారు.
మొదలైన జాతర సందడి
గుడిమెలుగు తంతు పూర్తి కావడంతో మేడారంలో జాతర వాతావరణం సంతరించుకుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం ఈ పండుగ ముగిసిన నాటి నుండి భక్తుల రాక గణనీయంగా పెరుగుతుంది. ప్రధాన జాతర తేదీలు సమీపిస్తున్న కొద్దీ లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉండటంతో.. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు.
అమ్మవార్ల ఆశీస్సుల కోసం భక్తులు ఇప్పుడిప్పుడే మేడారానికి చేరుకుంటూ, బెల్లం (బంగారం) సమర్పించుకుంటున్నారు. గుడిమెలుగుతో మొదలైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, రాబోయే మహా జాతరతో పతాక స్థాయికి చేరుకోనుంది.
ALSO READ: Minister Seethakka: ములుగు జిల్లా రద్దు అవుతోందా..? మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు