Medaram Maha Jatara 2026: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే మేడారం మహా జాతర 2026కు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర 2026 పోస్టర్ను అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క–సారక్కలను స్మరించుకుంటూ, మేడారం మహా జాతరను కేవలం ఒక మతపరమైన ఉత్సవంగా కాకుండా తెలంగాణ సంస్కృతి, చరిత్రకు ప్రతీకగా నిలిపేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంకి సమ్మక్క తల్లి కంకణం కట్టి, బొట్టు పెట్టారు మంత్రి సీతక్క.
మేడారం మహా జాతర 2026 జనవరి 28 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరకు దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా లక్షలాది భక్తులు తరలివస్తారు. ఈ భారీ జనసందోహానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మేడారం జాతర అభివృద్ధి పనులకు.. సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. మేడారంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి, గద్దెల ఆధునీకరణ, రహదారులు, తాగునీటి సదుపాయాలు, భక్తులకు సౌకర్యవంతమైన ఏర్పాట్లను ఆ వీడియోలో చూపించారు.
మేడారం జాతర ప్రాముఖ్యతను వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు, బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లే తెలంగాణకు దేవుళ్లు అని ఆయన అన్నారు. సమ్మక్క–సారక్కలు కేవలం దేవతలు మాత్రమే కాదని, అణచివేతకు గురైన ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనితలని గుర్తుచేశారు. వారి సంస్కృతే మన అస్థిత్వమని, వారి త్యాగాలు తరతరాలకు స్ఫూర్తినిస్తాయని సీఎం పేర్కొన్నారు.
Also Read: బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏం జరుగుతోంది? సీఎం రేవంత్ చెప్పింది కరెక్టేనా? ప్రధాని ఎందుకు ఆరా తీశారు?
మేడారం జాతర అభివృద్ధి పనులు కేవలం భౌతిక సదుపాయాల వరకే పరిమితం కావని, గిరిజనుల ఆత్మగౌరవాన్ని, వారి సంస్కృతిని కాపాడటమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు సాగుతున్నాయని మంత్రులు తెలిపారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం వల్ల మేడారం జాతరకు మరింత విశ్వవ్యాప్త గుర్తింపు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ నివాసంలో మేడారం మహా జాతర-2026
పోస్టర్ ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డిహాజరైన మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్
జనవరి 28 నుంచి 31 వరకు మేడారం మహా జాతర pic.twitter.com/IYnKfreg2z
— BIG TV Breaking News (@bigtvtelugu) December 21, 2025
ఎక్స్ వేదికగా మేడారం జాతర అభివృద్ధి పనుల వీడియోను షేర్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
చరిత్రలో పేద జనుల కోసం పోరాడిన వాళ్లు
బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు తెలంగాణకు దేవుళ్లు
వారి సంస్కృతి మన అస్థిత్వం
వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి
సమ్మక్క-సారక్క మనుషుల్లో దేవుళ్లు
— BIG TV Breaking News (@bigtvtelugu) December 21, 2025