Telangana Politics: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ప్రస్తుతం రాజకీయాల నేపథ్యంలో ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ గురించి ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీయడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మేటరేంటి? ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యా యా? అంటూ చర్చించుకోవడం తెలంగాణ బలంగా వినిపిస్తోంది.
బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఏం జరుగుతోంది?
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆ పార్టీ ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ప్రధాని. ప్రస్తుతం ఈ పరిణామంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఎందుకంటే ప్రధాని మోదీ-కేసీఆర్ కలిసి దాదాపు నాలుగేళ్లు పైనే అయ్యింది.
సీఎం హోదాలో 2021లో ప్రధాని మోదీని కలిశారు కేసీఆర్. ఆ తర్వాత మారిన రాజకీయాల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చినా కనీసం వెళ్లలేదు కేసీఆర్. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో మోదీ వర్సెస్ కేసీఆర్ అన్నచందంగా విమర్శల పర్వం సాగింది.
కేసీఆర్ గురించి ప్రధాని ఆరా వెనుక
ఏడాదిన్నర కాలంగా ప్రధాని మోదీ.. కేసీఆర్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. శుక్రవారం పార్లమెంట్లో ప్రధాని మోదీని ఆయన కార్యాలయంలో బీఆర్ఎస్ ఎంపీలు సురేశ్రెడ్డి, రవిచంద్ర, దామోదర్రావు కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీశారు.
కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి.. తాను ప్రత్యేకంగా చెప్పాలంటూ పేర్కొనడం కొత్త పరిణామాలకు దారితీసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని, మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అవుతున్నారని ఆ పార్టీ ఎంపీలు వివరించినట్టు తెలుస్తోంది.
ALSO READ: సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు
ఈ వ్యవహారంపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీజేపీ-బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ లేకపోలేదు. తెలంగాణలో రాజకీయాల్లో ఈ రెండు పార్టీలపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటేనని, పంచాయతీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగడం ఖాయమని ఓ వైపు, ఈ రెండు పార్టీ మధ్య పొత్తు ఉంటుందని మరోవైపు వార్తలు లేకపోలేదు. ఇలాంటి సమయంలో కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధాని ఆరా తీయడం వెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు. ఆదివారం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. మోదీ వ్యవహారం, ఆ పార్టీతో పొత్తుల గురించి ఏమైనా నోరు ఎత్తుతారా? అన్నది చూడాలి. మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాాదని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ రెండు పార్టీల మధ్య ఏం జరుగుతుందో చూడాలి.