Medaram Temple: మిషన్ మేడారం చివరిదశకు చేరుకుంది. ఆలయ ఆధునికీకరణ, గద్దెల విస్తరణ, ప్రధాన మందిరం చుట్టూ.. రాతి ప్రాకారం పనులు మరో రెండు వారాల్లో పూర్తి కానున్నాయి. సకలజనుల దైవాలు సమ్మక్క సారక్క దేవతలు కొలువుదీరిన మేడారం అభివృద్ధి పనుల తర్వాత కొత్త కళాఖండాన్ని తలపించనుంది.
2026 మాహా జాతరకు సరికొత్త ఆలయ ప్రాంగణం భక్తులను మైమరపించనుంది. ఆ వన దేవతల ప్రాంగణంలో నిర్మిస్తున్న గ్రానైట్ పిల్లర్లపై ఆదివాసి ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా వేలకొద్దీ చిత్రాలు లిఖించారు. ఈశాన్య వైపున ఉన్న ప్రధాన ఎంట్రన్స్ వద్ద సమ్మక్క ప్రత్యేకతలను భారీ పిల్లర్ పై లిఖించారు.
రెండేళ్లకొసారి జరిగే తెలంగాణ కుంభమేళ.. గిరిజన దేవతలు సమ్మక్క సారక్కలు కొలువుదీరిన మేడారం ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంది.. పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో మహా అద్భుత క్షేత్రంగా నయా లుక్తో వెలిగి పోతుంది. సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో.. చరిత్రలో నిలిచిపోయేలా మేడారం మందిరం మార్పు చెందుతోంది. 2026 మహా జాతరలోపే సమ్మక్క సారక్క గద్దెలతో పాటు, మేడారం గ్రామం రూపురేఖలు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఆయనే స్వయంగా మేడారం వచ్చి మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. మేడారం జాతర అంటే వనదేవతల దర్శనం మాత్రమే కాదు, ఆ తల్లుల చరిత్ర, ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు భక్తులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. మేడారం తల్లుల ప్రాంగణం చుట్టూ గ్రానైట్తో ప్రాకారం నిర్మించారు. ఈ రాతి గోడలపై 7000 పైచిలుకు ఆదివాసుల పుట్టుపూర్వోత్తరాలు, సంస్కృతి సాంప్రదాయాలు, జీవనశైలి తెలిపే విధంగా చిత్రాలు లిఖించారు. రాతి శిలలపై చెక్కిన శిల్పాలను చూస్తుంటే, ఆదివాసుల ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.
251 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన మేడారం మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు చకచకా జరిగిపోతున్నాయి. గద్దెల ప్రాంగణం పూర్తిగా రాతి నిర్మాణాలతో ఆధునికరిస్తున్నారు. ఇప్పటికే గ్రానైట్ నిర్మాణ పనులు 80% శాతం పూర్తయ్యాయి. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. మంగళవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి అభివ్రుద్ది పనులను పరిశీలించారు. జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 200ఏళ్ల తర్వాత కూడా చెక్కుచెదరని నిర్మాణం చేస్తున్నామని, మహాజాతరకు ప్రతిపక్ష నేతలను సైతం ఆహ్వానిస్తామన్నారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న మహాయజ్ఞమే మేడారానికి కొత్త రూపం అన్నారు మంత్రి సీతక్క. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలిపేలా నిర్మాణాలను జరిపించి సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల మహాజాతరకు కొత్త శోభ తెచ్చారన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు విశాలమైన రహదారులు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు పూర్తి చేసామన్నారు.
సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం పూర్తయింది. ఒక్కో గద్దె నిర్మాణానికి 8 పిల్లర్ల చొప్పున మొత్తం 32 రాతి నిర్మాణాలతో గద్దెల ఆధునికీకరణ జరుగుతోంది. మేడారంలో ఇప్పటికే రాతి నిర్మాణాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. భావితరాలు చర్చించుకునేలా ఇక్కడ అపురూప నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ ప్రతిష్టించే ప్రతిరాతి నిర్మాణంపైన పూర్తిగా ఆదివాసి ఆచార సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు ప్రతిబింబించేలా వాటిపై చిత్రలిపి చేశారు.. గద్దెల ప్రాంగణంలో దాదాపు నాలుగు వేల టన్నుల గ్రానైట్ ఉపయోగిస్తున్నారు. సాండ్ స్టోన్స్ పై ఆదివాసీల చరిత్ర, ఆచార సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఏడు వేలకు పైగా చిత్రాలు లిఖించారు. ఎంతమంది భక్తులు వచ్చినా.. నలుగురు దేవతలను వరుస క్రమంలో దర్శించుకుని వెళ్లే విధంగా ఆలయ మందిరం రూపుదిద్దుకోబోతోంది.
తాళపత్ర గ్రంథాల ఆధారంగా అనేక ఆధారాలు సేకరించి, గ్రానైట్ పైన చిత్రలిపి, వాటి మౌల్డింగ్ అంతా ఆంధ్రప్రదేశ్ లోని రాయచూర్, ఆళ్లగడ్డలో ప్రత్యేక స్థపతిల చేత తయారు చేయించి మేడారంకు తరలిస్తున్నారు. సాండ్ స్టోన్స్ పై రూపుదిద్దుకున్న వాటిని ఇక్కడ భారీ క్రేన్ల సహాయంతో మేడారం గద్దెల ప్రాంగణంలో ప్రతిష్టిస్తున్నారు. మేడారం గద్దెల చుట్టూ నాలుగు టవర్ల నిర్మాణం, మేడారం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా ఆయుర్వేద గుణాలు కలిగిన చెట్లు పెంచేలా ప్లాన్ చేసారు. భూకంపాలు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేలా నిర్మాణాలు చేస్తున్నారు.
Also Read: ఆర్డీవో ఆఫీసర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. ఆస్తులను చూసి ఏసీబీ షాక్..
ఎన్నేళ్లయినా చెక్కుచెదరకుండా మేడారం చరిత్ర భావితరాలు చర్చించుకునేలా పూర్తిగా గ్రానైట్ తో అద్భుత ఆలయం మేడారంలో రూపుదిద్దుకుంటోంది. ఒకప్పుడు చిన్న గుడిసెలో కొలువైన అమ్మవార్లు, ఇప్పుడు ప్రపంచమే అబ్బురపడే కళాకృతులతో కూడిన గ్రానైట్ మందిరంలో కొలువుదీరుతుండడంతో వనదేవతల పూజారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవార్లకు మొక్కులతో పాటు, ప్రాచీనమైన… ప్రత్యేకమైన ఆదివాసీల చరిత్ర సాంప్రదాయాలు, జీవనశైలి భక్తులకు తెలిపేలా ఆలయం నిర్మించడం మహా గొప్ప కార్యమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
The Glory of Medaram for Centuries
Restoration works are progressing so that it flourishes for ages to come.As per the planned timeline, The people's government is moving forward to showcase the magnificent Medaram to the devotees.
Along with State Government Advisor… pic.twitter.com/PWHoEWeDPG
— Danasari Seethakka (@seethakkaMLA) December 23, 2025