సికింద్రాబాద్లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలిపారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు.
ప్రస్తుతం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఆర్టీసీలోకి కొత్త జోష్ వస్తుందన్నారు మంత్రి పొన్నం. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ, స్క్రాప్ పాలసీలు తీసుకొచ్చామని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.