Ponnam Prabhakar: పంచాయితీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రంలో నెలకొన్న చర్చ నేపథ్యంలో మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని పార్టీల నిర్ణయం తీసుకుని కేంద్రానికి బిల్లు పంపిన విషయం అందరికీ తెలుసునని మంత్రి పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దు అనే మాట ప్రతిపక్షాలకు తెలుసునని అన్నారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్న విషయం కూడా వారికి తెలుసు. ప్రభుత్వం జారీ పడితే చూసి నవ్వాలని ప్రతిపక్షాలు రాక్షస ఆనందం పొందుతున్నాయి’ అని మంత్రి విమర్శలు చేశారు.
42 శాతం రిజర్వేషన్లను అడ్డుకుంటుంది ప్రతిపక్ష పార్టీలేనని పొన్నం మంత్రి ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని తమ ఆలోచన అని.. ఇదే ఆలోచనతో తమ ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు. బీసీ మంత్రులుగా ప్రభుత్వాన్ని ఒప్పిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి ఛాంపియన్గా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.
కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉంటే 42 శాతం రిజర్వేషన్లు గంటలోపే వచ్చేవని మంత్రి పొన్నం తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్, బీజేపీలకు లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేంద్రం EWS రిజర్వేషన్లు తెచ్చినప్పుడు కోర్టులో పిటిషన్లు దాఖలు చేయలేదని ప్రతిపక్షాల వైఖరిని ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన నిలబడుతుందని.. రిజర్వేషన్ల అమలుకు కృషి చేస్తుందని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.
ALSO READ: Passenger Train: బ్రిడ్జి మీది నుంచి పట్టాల మీద పడిపోయిన ట్రక్, రైళ్ల రాకపోకలు బంద్!