రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే ఆమె.. తాజాగా రోడ్డు ప్రమాద బాధితుల పట్ల కన్నతల్లిలా స్పందించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం చూసి చలించిపోయిన మంత్రి.. వెంటనే తన ప్రయాణాన్ని ఆపి బాధితులకు అవసరమైన సాయం అందించారు.
బీబీనగర్ శివారులో ఒక దంపతులు తమ ఇద్దరు చిన్నారులతో కలిసి ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో దంపతులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి సీతక్క.. బాధితులు రోడ్డుపై పడి ఉండటం గమనించారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కాన్వాయ్ను నిలిపివేసి కారు దిగి బాధితుల వద్దకు వెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న దంపతులను చూసి భయంతో విలపిస్తున్న చిన్నారులను ఆమె దగ్గరకు తీసుకుని ఓదార్చారు. వారి కన్నీళ్లు తుడుస్తూ ధైర్యం చెప్పారు.
ప్రమాద తీవ్రతను గమనించిన మంత్రి.. అంబులెన్స్ కోసం వేచి చూడకుండా అత్యంత వేగంగా స్పందించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించేలా తన సిబ్బందిని ఆదేశించారు. బాధితులను తన సొంత వాహనంలోనే ఎక్కించుకుని దగ్గరలోని ఆసుపత్రికి పంపించారు. సమయానికి వైద్యం అందడం ముఖ్యమని భావించిన ఆమె.. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు ఫోన్ ద్వారా సూచించారు. బాధితులు కోలుకునే వరకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
మరోసారి మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
రోడ్డు ప్రమాద బాధితులకు ఆపన్న హస్తం
బీబీనగర్ వద్ద ప్రమాదానికి గురైన దంపతులు, చిన్నారులు
ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి
కాన్వాయ్ని ఆపి, చిన్నారులను ఓదార్చిన సీతక్క
గాయపడినవారిని తన వాహనంలోనే ఆస్పత్రికి తరలింపు
Minister… pic.twitter.com/UIa1Agqdr5
— BIG TV Breaking News (@bigtvtelugu) May 3, 2026
మంత్రి హోదాలో ఉండి కూడా సామాన్య ప్రజల కష్టాన్ని చూసి చలించిపోయి.. స్వయంగా రంగంలోకి దిగిన సీతక్క తీరుపై నెటిజన్లు.. స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి బాధితులను కాపాడటమే పరమావధిగా ఆమె వ్యవహరించిన తీరు అభినందనీయం. గతంలోనూ పలుమార్లు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకుని ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. నేటి ఘటనతో ప్రజా నాయకురాలిగా ప్రజల గుండెల్లో మరోసారి చెరగని ముద్ర వేసుకున్నారు.
ALSO READ: మూడు ముక్కల జీహెచ్ఎంసీతో ముప్పు తిప్పలు పడుతున్న జనం.. వెలుగులోకి విచిత్ర పరిస్థితులు..!