కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాలను అమెరికాకు తాకట్టు పెడుతూ దేశ ప్రతిష్టను మసకబారుస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అమెరికాకు ప్రణవిల్లుతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీజేపీ సర్కార్.. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మహిళా రిజర్వేషన్ డ్రామా ఆడుతోందని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో డిలిమిటేషన్ బిల్లును తీసుకురావడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆమె ధ్వజమెత్తారు. ఇప్పటికే పార్లమెంట్ ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ ప్రకారం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
పన్నెండు ఏళ్ల అధికారంలో ఉండి కూడా మహిళా బిల్లు విషయంలో ఎందుకు కాలయాపన చేస్తున్నారని సీతక్క ప్రశ్నించారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని చూడటం బిజెపి ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. బిజెపికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి షరతులు లేకుండా.. డిలిమిటేషన్ తో ముడిపెట్టకుండా రిజర్వేషన్లు తీసుకురావాలని సవాల్ విసిరారు. మహిళా ప్రధానిని, మహిళా రాష్ట్రపతిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఒక్క మహిళకు కూడా అధ్యక్ష పదవి ఇవ్వని బిజెపి మహిళా సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్యను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంపై విషం చిమ్మే నాయకులను బిజెపి ప్రోత్సహించడం సిగ్గుచేటన్నారు. బిజెపికి చేతకాకనే సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంపైకి కార్యకర్తలను పంపిస్తూ భౌతిక దాడులకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ వైఫల్యాలను, రాజకీయ కుట్రలను యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. లక్షల సంఖ్యలో ఉన్న యూత్ కాంగ్రెస్ శ్రేణులు దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించే సైనికులుగా పనిచేయాలని సూచించారు.
దేశం కోసం మహాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి మహనీయులు ప్రాణ త్యాగాలు చేశారని సీతక్క గుర్తు చేశారు. నెహ్రూ 17 ఏళ్ల పాటు జైలు జీవితం అనుభవించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారని వివరించారు. స్వాతంత్య్ర చరిత్రలో ఎలాంటి పాత్ర లేని బిజెపి నాయకులు నేడు జాతీయవాదం మీద నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సామాన్యుల పక్షాన నిలబడుతుందని.. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కీర్తిని గ్రామ గ్రామాన చాటి చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.