Tummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచి ‘తెలంగాణ మోడల్’గా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, సామాన్యుడికి అందాల్సిన సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపకుండా కొనసాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. మంచుకొండ ఎత్తిపోతల ద్వారా సుమారు 2,412 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, దీనివల్ల స్థానిక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ మంత్రి తుమ్మల భావోద్వేగంగా మాట్లాడారు. “నేను రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో కేవలం మూడు లిఫ్టులు మాత్రమే ఉండేవి. కానీ, ఈ రోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 లిఫ్టులను నా చేతుల మీదుగా ప్రారంభించే గొప్ప అవకాశాన్ని భగవంతుడు, ఈ ప్రజలు నాకు కల్పించారు.” అని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ (NSP) మీద ఏర్పాటు చేసిన చివరి లిఫ్ట్ ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని భరోసా ఇచ్చారు.
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా రూపురేఖలు మారిపోతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. “రేపు సీతారామ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత జిల్లాలోని అన్ని నదులు, వాగులు, వంకలకు పుష్కలంగా నీరు అందుతుంది. ప్రతి నియోజకవర్గానికి సీతమ్మ సాగర్ ద్వారా సాగునీరు అందిస్తాం.” అని రైతులకు మాట ఇచ్చారు. ప్రస్తుతం సాగర్లో నీటి లభ్యత పుష్కలంగా ఉందని, రైతులు ఈ నీటిని సద్వినియోగం చేసుకొని పంటలు పండించాలని కోరారు.
మంచుకొండ లిఫ్ట్ అనేది ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, భవిష్యత్తులో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. “వచ్చే ఏడాది బుగ్గవాగు పనులు ప్రారంభిస్తాను. అది పూర్తయితే గ్రావిటీ ద్వారానే మీ చెరువులకు నీళ్లు వస్తాయి.” అని ప్రకటించారు. జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందించడమే తన లక్ష్యమని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల నాగేశ్వరరావు పునరుద్ఘాటించారు.
Read Also: చైనా మాంజాపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. సీపీ సజ్జనార్కు నోటీసులు