నిషేధిత చైనా మాంజా విక్రయాలు, వినియోగంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నగరంలో ప్రాణాంతకంగా మారిన ఈ మాంజా కట్టడిపై స్పష్టమైన నివేదిక సమర్పించాలని కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్కు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.
పిటిషనర్ ఆవేదన..
అడ్వకేట్ రామరావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్పై కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్లలో చైనా మాంజా కారణంగా సామాన్య ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారని, పక్షులు సైతం ఈ దారానికి చిక్కి మృత్యువాత పడుతున్నాయని పిటిషనర్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో దీని అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నివేదికకు గడువు..
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హెచ్ఆర్సీ.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న చైనా మాంజా విషయంలో పోలీసులు తీసుకున్న చర్యలేమిటో తెలియజేయాలని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీలోపు తమ ముందు ఉంచాలని పోలీసు శాఖను ఆదేశించింది.
ప్రమాదకరమైన చైనా మాంజా..
సాధారణంగా పతంగులు ఎగురవేసేందుకు వాడే ఈ మాంజాను నైలాన్ లేదా సింథటిక్ పదార్థాలతో తయారు చేస్తారు. దీనికి గ్లాస్ కోటింగ్ ఉండటం వల్ల ఇది అత్యంత పదునుగా ఉంటుంది. దీనివల్ల ప్రమాదవశాత్తు దారిలో వెళ్లేవారి మెడకు, కాళ్లకు ఈ దారం తగిలితే తీవ్రమైన గాయాలవ్వడమే కాకుండా, మెడ నరాలు తెగి మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, కొంతమంది విక్రేతలు రహస్యంగా దీనిని విక్రయిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే.. కమిషన్ ఇచ్చిన నోటీసులతో ఇకనైనా చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడతారని సామాన్య ప్రజలు భావిస్తున్నారు
ALSO READ: UP Crime: పోలీసుస్టేషన్లో దారుణం.. అందరూ చూస్తుండగా, భార్యని కాల్చిన భర్త, యూపీలో ఘోరం