Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్రంలో ఇంధన నిల్వలు, సరఫరాకు సంబంధించి పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు సంబంధించి వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. ప్రజలు భయాందోళనలకు లోనై భారీగా నిల్వ చేసుకోవడం (Panic buying) వల్లే బంకుల వద్ద రద్దీ పెరుగుతోందని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో ఏర్పడిన ఇంధన కొరత ప్రభావం మన రాష్ట్రంలోని ఖమ్మం, మిర్యాలగూడ, నిర్మల్ వంటి ప్రాంతాలపై పడిందని ఆయన వివరించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ధరలు భారీగా పెరుగుతాయన్న వదంతుల వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. దీనికి తోడు పారిశ్రామిక డీజిల్ ధర లీటరుకు రూ. 150 ఉండగా, రిటైల్ ధర రూ. 95 మాత్రమే ఉండటంతో.. పారిశ్రామిక వినియోగదారులు కూడా రిటైల్ బంకుల వద్దే కొనుగోలు చేయడం వల్ల నిల్వలు త్వరగా ఖాళీ అవుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసుకుని ఇంధన సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పెంచిందని ఆయన తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల ఏప్రిల్ 29 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఇంధన పంపిణీ రికార్డు స్థాయికి చేరిందని మంత్రి వెల్లడించారు.రోజువారీ సగటుతో పోలిస్తే డీజిల్ పంపిణీ 210 శాతం పెరిగి 22,782 KL లకు చేరింది. పెట్రోల్ పంపిణీ 132 శాతం పెరిగి 13,622 KL లకు చేరుకుంది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సరఫరా అవుతున్న ఇంధనం సగటు కంటే 175 శాతం అదనంగా ఉందని ఆయన గణాంకాలతో వివరించారు.
జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని ‘డిస్ట్రిక్ట్ ఎనర్జీ సప్లై కమిటీ’లను యాక్టివేట్ చేశామని.. రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణలో బంకుల వద్ద నిరంతరం తనిఖీలు సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ అవసరాల కోసం హార్వెస్టర్లు, రవాణా వాహనాలకు డీజిల్ కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు కేవలం ఇంధనం కోసం సరిహద్దు దాటకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967 ను సంప్రదించాలని సూచించారు.
Read Also: వికలాంగుల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి సీతక్క కీలక ప్రకటన