Khammam News: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై కీలక ప్రసంగాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని వారు హామీ ఇచ్చారు.
పాలేరు నియోజకవర్గంతో తనకు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని, కాలువల నిర్మాణానికి ఒక్క ఎకరం భూసేకరణ కూడా చేయలేదని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. జిల్లాలో సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి రంగాలను బలోపేతం చేయడమే తమ దార్శనికత అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లాకు జేఎన్టీయూ (JNTU) క్యాంపస్, నర్సింగ్ కళాశాలలు మరియు కీలక సాగునీటి పనులను తీసుకువచ్చామని వివరించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకురావాలని, జిల్లాకు ప్రత్యేక ఇండస్ట్రియల్ ప్యాకేజీలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరుతున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Read Also: నైనీ బొగ్గు గనుల వ్యవహారం.. కథనాలపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం