Vande Bharat Sleeper Train: మన దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కిన ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా నుంచి ప్రధాని మోదీ శనివారం(నేడు) ఈ రైలును ప్రారంభించారు. అయితే, మొదటి రోజే ప్రయాణికుల ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలకత్తా సమీపంలోని హౌరా నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్ వరకు ప్రాయణించే ఈ రైలు.. ఆ మార్గంలో అతివేగంగా ప్రయాణించే ట్రైన్గా గుర్తింపు పొందింది. కానీ ఇంతటి అధునాతన రైలులో ప్రయాణికులు వేసిన చెత్తాచెదారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
రైలు బోగీల్లో ఎక్కడ పడితే అక్కడ పడేసిన ఖాళీ పేపర్ కప్పులు, వాడిన స్పూన్లు, ఇతర వ్యర్థాలతో నిండిన దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలను రికార్డ్ చేసిన వ్యక్తి, ‘ఇది రైల్వే శాఖ తప్పా లేక ప్రభుత్వం తప్పా? లేక మన బాధ్యతారాహిత్యమా?’ అంటూ ప్రశ్నించడం అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘మన పౌరుల తీరు(Civic Sense) ఏ స్థాయిలో ఉందో చూడండి’ అంటూ అతడు చేసిన వ్యాఖ్యలు సమాజంలోని బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతున్నాయి. కేవలం ఖరీదైన టికెట్లు కొన్నంత మాత్రాన సభ్యత, సంస్కారం రావని, చదువుకున్న వారు కూడా ఇలా ప్రవర్తించడం విచారకరమని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. నాణేనికి మరో వైపే డార్క్ టూరిజం!
ఈ రైలు సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి రాకముందే ఇలాంటి ఘటనలు జరగడంపై రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రారంభానికి ముందే సీనియర్ రైల్వే అధికారి అనంత్ రూపనగుడి ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి చేశారు. పబ్లిక్ ప్రాపర్టీని గౌరవించాలని, ముఖ్యంగా వాష్రూమ్ నియమాలను పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. కాగా.. ఈ వందే భారత్ స్లీపర్ రైలు ప్రస్తుతం సాధారణ ప్రయాణికుల బుకింగ్ కోసం అందుబాటులో లేదని, త్వరలోనే దీని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సౌకర్యాలు కల్పించినా, ప్రజల్లో మార్పు రానంత వరకు ఇలాంటి గొప్ప ప్రయత్నాలు విజయవంతం కావని ఈ ఘటన మరోసారి నిరూపించింది.