Congress Foundation Day: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల అనంతరం అజారుద్దీన్తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. దేశాభివృద్ధిలో, స్వాతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్రను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
గ్రామీణ పేదలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సోనియా గాంధీ హయాంలో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం తెలిపారు. అయితే, బీజేపీ ప్రభుత్వం ఈ పథకం పేరులో నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించి, చరిత్రను చెరిపివేయాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో కేంద్రమే పూర్తి భారాన్ని మోసేదని, ఇప్పుడు 60:40 నిష్పత్తితో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామ సభలో తీర్మానం చేసి, ఆ కాపీలను ప్రధాని మోదీకి పంపాలని పిలుపునిచ్చారు.
మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని, ఎఫ్ఆర్బీఎం (FRBM) పరిమితిని కూడా పెంచడం లేదని ఆరోపించారు. ఉపాధి హామీకి 90 శాతం నిధులు కేంద్రమే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్పైనా మంత్రులు విరుచుకుపడ్డారు. కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోయిందని, ఆ పార్టీకి ప్రజల్లో స్థానం లేదని, కేవలం సోషల్ మీడియాలోనే బతుకుతోందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావాలని హితవు పలికారు. కవిత అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Also: BRS : చిక్కులు, సవాళ్లతో స్వాగతం పలుకుతున్న 2026.. బీఆర్ఎస్కు దిక్కెవరు?