రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలల దుస్థితిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
పాలనా వైఫల్యానికి పరాకాష్ఠ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు విద్యాశాఖ మంత్రిగా ఉంటూనే, మరోవైపు గురుకులాలను గాలికొదిలేశారని హరీష్ రావు విమర్శించారు. ‘సీఎం గారూ.. మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా లేక విషసర్పాలకు ఆవాసాలా?’ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు పోజులిస్తుంటే.. ఇక్కడ పేద విద్యార్థులు కనీస రక్షణ లేక ఆసుపత్రుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు.
అధ్వాన్నంగా గురుకులాల పరిస్థితి
గత ప్రభుత్వంలో వెలుగు వెలిగిన గురుకులాలు నేడు అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్గా మారాయని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. 20 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతామంటూ రంగుల లోకం చూపిస్తున్న ప్రభుత్వం, ఉన్న పాఠశాలలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గురుకుల ఆవరణల్లో పిచ్చి మొక్కలు తొలగించే దిక్కు లేదని, కనీసం లైట్లు కూడా వేయడం లేదని విమర్శించారు. అపరిశుభ్రత కారణంగా కుక్క కాట్లు, పాము కాట్లు సర్వసాధారణంగా మారిపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
‘మా పిల్లలు గురుకులాలకు చదువుకోవడానికి వెళ్తున్నారా? లేక చావుతో పోరాడటానికి వెళ్తున్నారా?’ అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు తెలిపారు. విద్యార్థులకు కడుపు నిండా తిండి లేదని, ప్రాణాలకు భద్రత కరువైందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పతనమవుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.
మెరుగైన వైద్యం అందించాలి
పాముకాటుకు గురైన అశ్మితకు ప్రభుత్వం తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, ఆమె ప్రాణాలను కాపాడాలని హరీష్ రావు కోరారు. రాజకీయ కక్షసాధింపుల మీద ఉన్న శ్రద్ధలో కొంత అయినా పేద విద్యార్థుల బతుకుల మీద పెట్టాలని ముఖ్యమంత్రికి హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ఫైరయ్యారు.
హరీష్ పై కాంగ్రెస్ శ్రేణులు ఫైర్..
హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో కన్నా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. గురకుల వ్యవస్థ కేసీఆర్ హయాంలో కన్నా.. ఇప్పుడే బాగుందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నారు.