KTR: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా ఉన్న వీరితో పాటు మొత్తం 23 మందిని కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్ చీట్ ఇచ్చింది.
ఈ పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి.. తెలంగాణ అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయడానికే ఈ ‘లిక్కర్ స్కామ్’ అనే కల్పిత గాథను తెరపైకి తెచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కావాలనే తప్పుడు కథనాలను ప్రచారం చేయడం వల్ల గత ఎన్నికల్లో తమ పార్టీ రాజకీయంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రతీకారంతోనే తమ నాయకులపై ఇన్ని రోజులు తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు.
కోర్టు తీర్పుతో కవితకు న్యాయం జరిగిందని.. అదే విధంగా బీఆర్ఎస్ నాయకులపై పెట్టిన ప్రతి కేసు తప్పుడుదని.. రాజకీయ ప్రేరేపితమని త్వరలోనే రుజువవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్ధారించే వరకు కాంగ్రెస్.. బీజేపీలు చేసే బాధ్యతారాహిత్యమైన ఆరోపణలను ప్రజలు భరించాల్సి వస్తోందని విమర్శించారు. మీడియా ట్రయల్స్ ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించి తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడమే వీరి లక్ష్యమని దుయ్యబట్టారు. రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కేందుకు ప్రభుత్వ సంస్థలను వాడుకుంటున్నారని ఆరోపించారు.
“న్యూ ఇండియా”లో ఆధారాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యత పెరిగిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే తీర్పులుగా మారుతున్న దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా న్యాయమే గెలుస్తుందని.. తమపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని కాలమే నిరూపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కవిత నిర్దోషిగా బయటకు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ తీర్పు రాజకీయంగా తమకు పెద్ద నైతిక విజయమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.