ఇటీవల సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డితో సహా రితేష్ రెడ్డి, నమిత శర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను ఉప్పరపల్లి కోర్టు మంగళవారం తిరస్కరించింది. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి వారి అభ్యర్థనను తోసిపుచ్చారు.
గత కొద్దిరోజులుగా ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఫామ్ హౌస్ వేదికగా నిషేధిత మత్తు పదార్థాలు వినియోగించారనే ఆరోపణలపై పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. నిన్నటి విచారణలో ఇరుపక్షాల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుల వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు బలంగా వాదించారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సరైన నిర్ణయం కాదని ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించింది.
బెయిల్ పిటిషన్లపై తీర్పునిస్తూ కోర్టు నిందితులకు ఊరట ఇచ్చేందుకు నిరాకరించింది. మరోవైపు పోలీసు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై కూడా కోర్టులో కీలక చర్చ జరిగింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? సరఫరాదారులు ఎవరు? అనే కోణంలో లోతుగా విచారించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కస్టడీ పిటిషన్ పై నిర్ణయాన్ని న్యాయస్థానం రేపటికి రిజర్వ్ చేసింది. బుధవారం వెలువడే తీర్పుపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో ఏ1గా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీకి సంబంధించిన వీడియోలు అలాగే ఫోన్ కాల్ డేటాను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పట్టుబడిన నిందితుల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా కేసును మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవేళ కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే నిందితులను పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించే అవకాశం ఉంది.
రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న వ్యక్తి కావడంతో ఈ కేసు పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఈ తీర్పు కీలకంగా మారింది. రేపు కస్టడీ పిటిషన్ పై వచ్చే తీర్పు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు తదుపరి గమనం ఖరారు కానుంది. నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.
ALSO READ: పాకిస్థాన్లో లాక్ డౌన్.. రాత్రి 8 గంటలకే అన్నీ బంద్.. వారానికి 4 రోజులే పని..