Hyderabad News: హైదరాబాద్ కొండాపూర్ లోని ఏఎంబి మాల్ సమీపంలో గల మహేంద్ర షోరూం లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదంలో షోరూమ్ లో గల కార్లు దగ్ధమైనట్లు ఫైర్ అధికారులు తెలిపారు.
కొండాపూర్ లోని ఏఎంబి మాల్ వద్ద మహేంద్ర షోరూం ఉంది. రోజువారీ మాదిరిగానే షోరూమ్ కు గురువారం రాత్రి 10 గంటల అనంతరం సిబ్బంది తాళాలు వేసి వెళ్లిన క్రమంలో, లోపల నుండి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల గల దుకాణాల యజమానులు అప్రమత్తమై ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందజేశారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో, ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
కాగా ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. షోరూం కు సెట్ బ్యాక్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. షోరూంకు పక్కనే ఉన్న ఓయో రూమ్ కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఓయో రూమ్ లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంపై రంగారెడ్డి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కరీం మాట్లాడుతూ.. సుమారు 10 గంటల సమయంలో ఫైర్ స్టేషన్ కి కాల్ వచ్చిందని, వెంటనే మాదాపూర్ లో ఉన్న ఫైర్ ఇంజిన్ ను మహేంద్ర షో రూమ్ వద్దకు పంపించామన్నారు. మంటలు ఎక్కడ నుంచి చెలరేగాయో అర్థం కావడం లేదని తెలిపారు.
మహీంద్రా షోరూంలో దాదాపు 10 కి పైగా కార్లు ఉన్నట్లు సిబ్బంది ద్వార తెలిసిందని, ఇందులో చాలా వరకు కాలి పోయాయన్నారు. కస్టమర్లకు చెందిన మూడు వెహికల్స్ కూడా అందులో ఉన్నట్లు, డెలివరీకి సిద్ధంగా ఉన్న మరొక వెహికల్ కూడా ఉందన్నారు. మహీంద్రా వెహికల్స్ కు సంబంధించిన స్పేర్ పార్ట్స్ గోదాములో మంటలు చెల్లరేగినట్లు తెలుస్తోందన్నారు. గోదాములో ఉన్న అన్ని స్పేర్ పార్ట్స్ కాలి బూడిద అయిపోయాయని, ప్లాస్టిక్ సామాగ్రి ,థర్మాకోల్ ఫ్యాబ్రిక్ వస్తువులు ఉండడం వల్ల మంటల వ్యాప్తి పెరిగిపోయిందన్నారు. మంటలు చెలరేగిన సమయంలో షోరూంలో సిబ్బంది ఎవరూ లేరని, షోరూమ్ మొత్తం దగ్ధమైపోయిందన్నారు.
Also Read: Tirumala Updates: తిరుమల వెళ్తున్నారా.. ఈ సమాచారం తప్పక తెలుసుకోండి
షోరూం నలువైపులా ఉన్న షాపులు, హోటల్స్ వైపు మంటలు వ్యాప్తి చెందకుండా మొదటగా కట్టడి చేశామని, మహేంద్ర షో రూమ్ పక్కనే ఒక స్కోడా షోరూం కూడా ఉందన్నారు. ఆ షో రూమ్ కి ఎటువంటి మంటలు వ్యాప్తి చెందలేదన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మహేంద్ర షోరూం పూర్తిగా కాలిపోతున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్న సహర్ష్, ఉడిపి హోటల్ కు మంటలు వ్యాప్తి చెందకుండా యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకున్నామన్నారు. ఓయో రూంలలో ఉన్న వందమందిని బయటకు పంపించేసామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందన్నారు. అయితే ఎంతవరకు ఆస్తి నష్టం జరిగిందనే దానిపై క్లారిటీ రావాల్సి ఉందన్నారు.