Chamala Kiran Kumar Reddy: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన ఆయన, ఫెడరల్ వ్యవస్థలో అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలని హితవు పలికారు. దేశంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీల అమలుతో పాటు, రావాల్సిన నిధులు, బకాయిలను ఈ బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేటాయిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కేంద్రం అనుసరిస్తున్న తీరుపై ఎంపీ కిరణ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘డబుల్ ఇంజన్ సర్కార్’ అని చెప్పుకుంటున్న కేంద్ర ప్రభుత్వం, కేవలం తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు లేదా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ పక్షపాతం చూపిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు నిధుల పంపిణీ సమానంగా జరగడం లేదని, ఈసారి బడ్జెట్లోనైనా తెలంగాణ పట్ల కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రం నుండి ఈ బడ్జెట్పై తమకు భారీ అంచనాలు ఉన్నాయని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు అందాల్సిన ప్రత్యేక నిధులు, ప్రాజెక్టుల పురోగతికి అవసరమైన ఆర్థిక సాయంపై ఆర్థిక మంత్రి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని, పార్లమెంట్ వేదికగా తెలంగాణ గళాన్ని వినిపిస్తామని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
Read Also: Harish Rao: మద్యం మాఫియా సర్కార్.. అబ్కారీ శాఖలో రూ.కోట్లల్లో అవినీతి, హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు