రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అవినీతి అస్త్రం సంధించారు. అబ్కారీ శాఖలో మైక్రో బ్రూవరీస్ లైసెన్సుల కేటాయింపులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బుధవారం మీడియాతో జరిగిన చిట్ చాట్లో ఆయన పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా 110 మైక్రో బ్రూవరీస్ దరఖాస్తులు రాగా.. ప్రభుత్వం కేవలం 25 మాత్రమే మంజూరు చేయాలని నిర్ణయించిందని హరీష్ రావు తెలిపారు. ఇందులో ‘మంత్రి కోటా’ కింద 4, ఒక ‘ముఖ్య నేత’ కోటా కింద 21 కేటాయించారని విమర్శించారు. ఒక్కో బ్రూవరీకి రూ. 1.80 కోట్లు వసూలు చేస్తున్నారని, అందులో రూ. 1.50 కోట్లు ముఖ్య నేతకు, మిగిలిన రూ. 30 లక్షలు ఆయన వెంటే ఉండే ఒక సన్నిహిత నేతకు వెళ్తున్నాయని ఆరోపించారు. వైన్ షాపుల మాదిరిగా లాటరీ పద్ధతిని ఎందుకు అనుసరించడం లేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మద్యం సరఫరా చేసే సంస్థలకు ప్రభుత్వం రూ. 4500 కోట్లు బకాయి పడిందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ హయాంలో 15 రోజుల్లోనే చెల్లింపులు జరిగేవని, ఇప్పుడు 16 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కమిషన్ల పంపకాల్లో తేడాల వల్లే ఈ బకాయిలు ఆపేశారని, దీనివల్ల రాష్ట్రంలో బ్రీజర్ల సరఫరా ఆగిపోయిందని, ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు కూడా సరఫరా నిలిపివేస్తామని లేఖలు రాశాయని వెల్లడించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘ఈ ప్రభుత్వానికి రైతులు ముఖ్యమా లేక బీరు కంపెనీలు ముఖ్యమా?’ అని నిలదీశారు. మెదక్ జిల్లా సింగూరు డ్యాం మరమ్మతుల పేరుతో సంగారెడ్డి జిల్లాలో 40 వేల ఎకరాలకు, ఘనపూర్ ఆయకట్ట కింద 30 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం, బీరు కంపెనీలకు మాత్రం చుక్క నీరు తగ్గకుండా సరఫరా చేస్తోందని ధ్వజమెత్తారు.
అబ్కారీ శాఖ స్పెషల్ సీఎస్ స్వయంగా అధికారులతో సమావేశమై, రైతులకు నీటిని ఆపివేసి మద్యం కంపెనీలకు పంపిణీ చేయాలని ఆదేశించడం దుర్మార్గమని పేర్కొన్నారు. హోలోగ్రామ్ టెండర్లలో సైతం ముఖ్య నేతల బంధువుల జోక్యం పెరిగిపోయిందని, ఈ ప్రభుత్వం పూర్తిగా మద్యం తయారీదారుల పక్షాన నిలబడిందని హరీష్ రావు విమర్శించారు.
ALSO READ: GHMC: జీహెచ్ఎంసీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీలో కొత్త విధానం.. ఇకపై చాలా ఈజీ, అదెలా అంటే..?