Chamala Kiran Kumar Reddy: మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. నీళ్లు, నిజాలపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే, దానికి సూటిగా సమాధానం చెప్పకుండా బీఆర్ఎస్ నేతలు పాత పాటే పాడుతున్నారని మండిపడ్డారు.
ప్రాజెక్టులు, నీళ్ల విషయంలో వాస్తవాలు మాట్లాడేందుకు, ఎవరు అసలైన తెలంగాణ ద్రోహో నిరూపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రతిపక్ష నాయకుడిని (కేసీఆర్) అసెంబ్లీకి ఆహ్వానించారని చామల గుర్తుచేశారు. కానీ, కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో అనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా, హరీష్ రావు తన మామ చెప్పిన స్క్రిప్టునే మళ్లీ మళ్లీ వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి వాస్తవాలు మాట్లాడాలని, అప్పుడే ఎవరు ద్రోహో తేటతెల్లం అవుతుందని సవాల్ విసిరారు.
బీఆర్ఎస్ హయాంలో యూరియాను రైతుల ఇంటికే తెచ్చి ఇచ్చామని హరీష్ రావు గొప్పలు చెప్పుకోవడంపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. “మీ పదేళ్ల పాలనలో రైతులు ఎరువుల కోసం క్యూలైన్లలో చెప్పులు పెట్టి, పోలీస్ స్టేషన్ల ముందు పడిగాపులు కాసిన విషయాన్ని జనం ఇంకా మరిచిపోలేదు. యూరియా కోసం రైతులు పడ్డ అవస్థలకు ఆనాడు పత్రికల్లో వచ్చిన వార్తలే నిదర్శనం. మీ పనితనం ఏంటో ఆ వార్తలే చెబుతాయి” అని చామల చురకలంటించారు.
గట్టిగా అరుస్తూ మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు ఎప్పటికీ నిజాలు కావని హరీష్ రావుకు హితవు పలికారు. ఇప్పటికైనా డొంకతిరుగుడు మాటలు కట్టిపెట్టి, ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.