Jute Farming: తెలంగాణలో వాణిజ్య పంటల సాగును ప్రోత్సహించే దిశగా భువనగిరి ఎంపీ, పార్లమెంట్ టెక్స్టైల్స్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన కృషి ఫలించింది. ఆయన చొరవతో జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (JCI) అధికారులు హైదరాబాద్కు తరలివచ్చారు. ఆదివారం నగరంలోని తాజ్ టెక్ హోటల్లో జేసీఐ అధికారులు కళ్యాణ్ కుమార్, మహాదేవ్ దత్తాలతో కలిసి ఎంపీ చామల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన కన్సల్టేటివ్ మీటింగ్లో, లోక్సభ వేదికగా తెలంగాణలో జూట్ (జనపనార) సాగు లేకపోవడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. దీనికి స్పందించిన కేంద్ర జూట్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన, చర్చల కోసం హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ రైతులు జూట్ పంటను ఎందుకు సాగు చేయడం లేదు? ఇక్కడ ప్రొడక్షన్ ఎందుకు జరగడం లేదు? అనే అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. జూట్ సాగు వల్ల రైతులకు ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కేవలం ఆర్థిక లాభాలే కాకుండా, ఈ పంట వల్ల భూసారం (Soil Fertility) పెరుగుతుందని, పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో రైతులు ఎక్కువగా వరి సాగుపైనే ఆధారపడుతున్నారని, జూట్ వంటి ప్రత్యామ్నాయ పంటల ద్వారా అధిక లాభాలు పొందవచ్చని సూచించారు.
ఈ విషయమై రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శితో మాట్లాడామని, రైతులకు అవగాహన కల్పించేందుకు అధికారులను క్షేత్రస్థాయికి పంపనున్నట్లు ఎంపీ తెలిపారు. ఎంఎస్ఎంఈ ప్రతినిధులు, జూట్ బ్యాంక్ నిర్వాహకులు పాల్గొన్న ఈ సమావేశంలో.. రానున్న రోజుల్లో తెలంగాణ నుంచి జూట్ ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
వరి, పత్తి వంటి పంటలకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ జూట్ పండిస్తే ఎవరు కొంటారు? ఎక్కడ అమ్ముకోవాలి? అనే భయం రైతుల్లో ఉంది. ఇక్కడ జూట్ మిల్లులు లేదా ప్రాసెసింగ్ యూనిట్లు పెద్దగా లేకపోవడం కూడా ఒక కారణం.జూట్ కేవలం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే పండుతుందనే అపోహ చాలా మందిలో ఉంది. తెలంగాణ వాతావరణానికి కూడా ఇది అనుకూలమేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నా, అది క్షేత్రస్థాయిలోకి వెళ్లలేదు. ఇప్పటివరకు ప్రభుత్వాలు కూడా జూట్ సాగును ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇవ్వడం గానీ, ప్రచార కార్యక్రమాలు చేయకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
Read Also: రాజకీయ పార్టీగా ‘తెలంగాణ జాగృతి’.. గన్పార్క్ వద్ద కవిత సంచలన ప్రకటన