New Political Party: తన సొంత తండ్రి స్థాపించిన పార్టీ (బీఆర్ఎస్)పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ జాగృతిని ఇకపై పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం గన్పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు.
“అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుంచి గెంటేశారు. అందుకే అవమాన భారంతో ఇంటి పార్టీ బంధాలు, రక్త సంబంధాలు అన్నీ వదులుకొని బయటకు వచ్చాను. రాజకీయాల్లో నైతికత అవసరం. నా ఎమ్మెల్సీ రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్కు విజ్ఞప్తి చేశా.” అని కవిత స్పష్టం చేశారు. తాను ఎవరి మీదా ఆధారపడి పని చేయనని, స్వశక్తితో నిలబడతానని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రజల హక్కులు, రాజకీయ అస్తిత్వం కాపాడేందుకే కొత్త రాజకీయ వేదిక అవసరమని కవిత అభిప్రాయపడ్డారు. అందుకే తెలంగాణ జాగృతి ముందడుగు వేసిందని, ఇకపై ఇది రాజకీయ పార్టీగా దళితులు, మైనార్టీలు, నిరుద్యోగుల కోసం పనిచేస్తుందని ప్రకటించారు. “మాతో కలిసి పనిచేసేందుకు లెఫ్ట్ పార్టీలను, మావోయిస్టు సానుభూతిపరులను ఆహ్వానిస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చేవారికి జాగృతిలో చోటు కల్పిస్తాం.” అని ఆమె పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ పార్టీపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ పెట్టినప్పటి నుంచి కష్టపడ్డ నిజమైన ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, తెలంగాణ ద్రోహులు పార్టీలో చేరాక పరిస్థితులు మారాయని మండిపడ్డారు. తనలాంటి ఒకరిద్దరికి తప్ప మిగతా ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదని, కనీసం ఐడీ కార్డులు కూడా ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. “అధికారంలో ఉన్నప్పుడు నీళ్ల కోసం లక్షల కోట్లు ఖర్చు చేశారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేకపోయారు.” అని విమర్శించారు.
ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చి రెండేళ్లు అవుతున్నా చేసిందేమీ లేదని, మహిళలను, నిరుద్యోగులను దారుణంగా మోసం చేసిందని ఆరోపించారు.
Read Also: Kalvakuntla Kavitha: మండలిలో కవిత కన్నీళ్లు.. నాపై కుట్రలు చేశారంటూ భావోద్వేగం