Chamala Kiran Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య లోక్సభలో చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ విభజనను భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చడం అత్యంత హేయమైన చర్య అని, ఇది తెలంగాణ సమాజాన్ని, ఇక్కడి 1600 మంది అమరవీరుల త్యాగాలను అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవడం కోసమే తేజస్వి సూర్య ఇలాంటి అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ను చామల కిరణ్ కుమార్ రెడ్డి సమర్థించారు. “రాష్ట్రాల ఆర్థిక వృద్ధి రేటు ఆధారంగా 50 శాతం సీట్లు, జనాభా ప్రాతిపదికన మిగిలిన 50 శాతం సీట్లు పెంచాలన్న సీఎం ప్రతిపాదన శాస్త్రీయమైంది. దీనిని హేళన చేయడం సరికాదు.” అని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకం అంటూ బీజేపీ సాకులు వెతుకుతోందని, గతంలో అనేకసార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఉండాలంటే హైబ్రిడ్ విధానమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయ డ్రామాలు ఆడుతోందని చామల విమర్శించారు. “కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్లకు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. కానీ, 2023లో బిల్లు పాస్ అయితే, దానిని 2027 జనాభా లెక్కల వరకు ఎందుకు పెండింగ్లో పెట్టారో తేజస్వి సూర్య సమాధానం చెప్పాలి” అని ఆయన నిలదీశారు. తన రాజకీయ అవసరాల కోసమే బీజేపీ డీలిమిటేషన్ ప్రక్రియను వాడుకుంటోందని, దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ ఏర్పాటును అవహేళన చేసిన తేజస్వి సూర్య వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని చామల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు రాష్ట్ర బీజేపీ ఎంపీలు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన తర్వాతే రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, ఆ కనీస అవగాహన కూడా తేజస్వి సూర్యకు లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ అస్తిత్వం కోసం, దక్షిణాది హక్కుల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
Read Also: పుండు మీద కారం.. బీజేపీ యవ్వారం..! తేజస్వీని సమర్థించి.. తమ అసమర్థతను చాటుకుని..!